మితిమీరుతున్న టీడీపీ నేతల పెత్తనం
● సచివాలయాల్లో నాయకుల హడావుడి
● చేతులెత్తేస్తున్న సిబ్బంది
నరసన్నపేట : అధికారంలోకి వచ్చిన 26 నెలల తర్వాత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్సీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల ముందు హామీనిచ్చిన కూటమి నాయకులు ఇప్పుడా హామీని పక్కన పెట్టి 60 ఏళ్లు నిండిన వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత, దివ్యాంగులు పింఛన్కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే గ్రామస్థాయిలో వచ్చే సరికి అర్హులకు పింఛన్లు అందుతాయా? అనే అనుమానం రోజురోజుకీ పెరుగుతుంది. దీనికి కారణం పింఛన్ల వ్యవహారంలో టీడీపీ నాయకుల హవా అతిగా ఉండటమే. గ్రామ సచివాలయాల్లో సిబ్బందిని పక్కన పెట్టి వారే దరఖాస్తులు తీసుకుంటున్నారు. కొంతమందికి ముందుగానే మీకు రాదు.. అని చెప్పేస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులు నిరాశతో వెనక్కి వెళ్తున్నారు. అలాగే దరఖాస్తుదారులు సచివాలయానికి వెళ్తే ముందుగా మీరు టీడీపీ నాయకులను కలవాలి.. అని సిబ్బందే నేరుగా చెబుతుండటం గమనార్హం. నరసన్నపేట నియోజకవర్గంలో ఈ తంతు అధికంగా ఉంది. బుధవారం నరసన్నపేట పంచాయతీ కార్యాలయంలోని సచివాలయంలో టీడీపీ నాయకుల హడావుడి ఎక్కువగా కనిపించింది. సిబ్బందితో పాటు టీడీపీ నాయకులు కూడా ఉద్యోగుల్లా సీట్లలో కూర్చుని దరఖాస్తులు తీసుకుంటున్నారు. దీంతో అర్హులకు పింఛన్లు మంజూరు అవుతాయా అనేది అనుమానంగా ఉంది. మరో పక్క సర్వర్ సమస్య అధికంగా ఉంది. దరఖాస్తులు వందల్లో వస్తుండగా అప్లోడ్ మాత్రం పదుల్లో అవుతున్నాయి. ఈ వ్యవహారంపై సర్వాత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.


