శ్రీకాకుళం పాతబస్టాండ్ : ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరులో జాప్యం జరగకుండా సంబంధిత శాఖలు అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాల మంజూరు, లక్ష్యాల సాధనపై సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని, వ్యవసాయ, హార్టికల్చర్, ఫిషరీస్, నాబార్డ్, పశుసంవర్ధక శాఖ, మెప్మా, అనుబంధ రంగాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి, మహిళా సాధికారత తదితర రంగాలకు అవసరమైన రుణాలను విస్తృతంగా అందించాలన్నారు. సమావేశంలో ఎల్డీఎం పేడాడ శ్రీనివాసరావు, కన్వీనర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.


