ఇచ్ఛాపురం రూరల్: ‘సొంతవాడే కదా.. మా బిడ్డను బంగారంగా చూసుకుంటాడు’ అనే ఆశతో కుమార్తెను మేనమామకు ఇచ్చి వివాహం చేసిన తల్లిదండ్రుల కలలు కల్లలయ్యాయి. ఇచ్ఛాపురం మండలం ధర్మపురం గ్రామానికి చెందిన మరడ రుక్మిణమ్మ, దేవేందర్ల కుమార్తె ధనలక్ష్మి(27)ని 2018 ఆగస్టులో ఒడిశా రాష్ట్రం రొంపా బొరడా గ్రామానికి చెందిన నందిక లోకనాథంకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఏడేళ్ల కుమారుడు రక్షిత్ ఉన్నాడు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతుండటంతో ధనలక్ష్మి కన్నవారి గ్రామం ధర్మపురంలో ఉంటోంది. పెద్దలు పలుమార్లు రాజీ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ భర్త వేధింపులు తీవ్రంగా ఉండటంతో మనస్థాపం చెందిన ధనలక్ష్మి శనివారం రాత్రి కన్నవారింట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి మృతదేహం వద్ద రక్షిత్ ‘అమ్మా.. లేవమ్మా.. నాతో మాట్లాడమ్మా..!’ అంటూ అమాయకంగా పిలుస్తూ కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. మృతురాలి తల్లి రుక్మిణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ ఆర్.జనార్దనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


