● జిల్లా కేంద్రంలో మూలుగుతున్న ‘జనగణన హౌస్మ్యాపింగ్’ నిధులు ● కేంద్రం విడుదల చేసినా పంపిణీ చేయని జిల్లా అధికారులు ● రెండు నెలలుగా ఉద్యోగుల నిరీక్షణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: భారత ప్రభుత్వం నిర్వహించిన జనగణనకు సంబంధించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ విధుల నిధులకు మోక్షం కలగడం లేదు. ఈ ప్రక్రియ నిర్వహించి రెండు నెలలు గడిచినా ఎన్యుమేరేటర్లు, ట్రైనర్లు, మాస్టర్ ట్రైనర్లు, ఇతర సిబ్బందికి డబ్బులు చెల్లించడం లేదు. ఈ సెన్సెస్కు సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం జిల్లాకు గత నెలలోనే విడుదల చేసింది. అయినా ఉద్యోగులకు పంపిణీ చేయడానికి మాత్రం అధికారులకు తీరికలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ పరిస్థిథి..
2027లో జరగనున్న జనగణనకు ముందస్తుగా క్షేత్రస్థాయిలో అన్ని గృహాలను సర్వే చేయించారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, మండల స్థాయి పరిశీలకులు, తహసీల్దార్లు, గణాంక శాఖ నుంచి ఏఎస్ఓలు, వీరికి టెక్నాలజీ ఇచ్చిన శిక్షకులు, వారికి శిక్షణను ఇచ్చిన మాస్టర్ ట్రైనీలు, ఇలా పలు స్థాయిల్లో గ్రామ వార్డు సచివాలయం రెవెన్యూ గణాంక శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు అదనపు పనులుగా ఈ సర్వే పూర్తి చేశారు. ఇందుకు గాను గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది.
నిధులు విడుదలైనా..
ఈ హౌస్ హోల్డ్ సర్వేకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మే నెలాఖరున రూ.89,98,450 నిధులను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఎన్యూమరేటర్ నుంచి అన్ని స్థాయిల్లో సర్వేలో పనిచేసిన వారికి, నిర్వహణ ఖర్చులు స్టేషనరీ ఖర్చులు, శిక్షణ సమయంలో భోజనాలు ఇతర ఖర్చులు చేసిన వారికి చెల్లించాల్సింది. అయినప్పటికీ నిధులు విడుదల చేయకుండా అధికారులు అట్టిపెట్టుకొని ఉంచడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
సెన్సెస్ సిబ్బంది వీరే..
హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియలో పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించారు. జిల్లాలోని 30 మండలాలకు మాస్టర్ ట్రైనీ, ట్రైనీలు కలిపి 90 మంది, మండల స్థాయిల్లో 750 మంది సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది 3600 మందిని నియమించారు. వీరితోపాటు తహసీల్దార్లు ప్రత్యేక అధికారులుగా, ఎంపీడీవోలను పర్యవేక్షణ అధికారులుగా విధుల్లో పాల్గొన్నారు. వీరందరికీ గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. సూపర్వైజర్లకు, ఎన్యుమరేటర్లకు మూడు దశల్లో శిక్షణ అందజేశారు. ఆ సమయంలో స్టేషనరీ సిబ్బందికి, భోజనాలు పెట్టిన హోటళ్ల నిర్వాహకులకు, ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఖర్చులు, టెక్నికల్ సపోర్ట్ స్టేషనరీ ప్రింటింగ్ ముద్రణ సామగ్రి, ఇతర ఖర్చులకు కలిపి సుమారు రూ.80లక్షలు పైచిలుకు చెల్లించాల్సి ఉంది.


