అన్నదాతకు..
● యూరియా, డీఏపీ కొనేందుకు కష్టాలు ● ఓటీపీ వస్తేనే ఎరువుల విక్రయం ● కౌలు రైతులకు పూర్తిగా ఎరువులు లేనట్లే..
గార : కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాతలకు కష్టాలు ఒకదాని తర్వాత మరొకటి వెంటాడుతునే ఉన్నాయి. ముఖ్యంగా ఖరీఫ్లో ఎరువులు(యూరియా, డీఏపీ) అందడం పెద్ద ప్రహసనంగా తయారయ్యింది. గంటల తరబడి క్యూలైన్లో ఉండటం, బస్తా యూరియా కావాలంటే అదనంగా రూ.300 చెల్లించడం వంటివి రెండేళ్లుగా కొనసాగుతున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం కలగడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్లో యూరియా, డీఏపీ అమ్మకాలను శాస్త్రవేత్తల సిఫారసుల మేరకు అందించాలని నిర్ణయించి ఏపీఏఐంఎస్ (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్) 2.ఓ అనే యాప్ తీసుకొచ్చింది. దీని ద్వారా మాత్రమే ఎరువులు అమ్మాలని నిర్దేశించింది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 30 మండలాల్లో 3,62,325 మంది రైతులుండగా, ఈ ఏడాది 5లక్షల 60 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా. కొన్ని ప్రాంతాల్లో వెబ్సైట్లో ఆధార్ ఎర్రర్, భూ విస్తీర్ణంలో తక్కువ చూపించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జాయింట్ ఎల్పీఎం రైతుల వివరాలు యాప్లో నమోదు చేయకపోవడంతో వారికి నిరీక్షణ తప్పడం లేదు. 20 సెంట్లు కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు పూర్తిగా ఎరువు ఇవ్వడం లేదు. వారంతా కాంప్లెక్సు ఎరువులపైనే ఆధారపడాల్సిందే.
ఓటీపీ ఇస్తేనే..
యాప్ ఆధారిత ఎరువుల పంపిణీలో రైతు భూమి వివరాలు పక్కాగా నమోదై ఉండాలి. కచ్చితంగా ఆధార్ సీడింగ్లో ఏ ఫోన్ నంబర్ ఉందో, వాటికే ఓటీపీ వస్తుంది. వాస్తవానికి సగం మంది రైతుల వద్ద ఫోన్ సౌకర్యం తక్కువే ఉంటోంది. వారి కుటుంబ సభ్యులకు నంబరుకు ఓటీపీ వెళ్లడంతో సకాలంలో చెప్పే వీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మాదిరిగా వేలిముద్రలు ద్వారా పంపిణీ చేయాలని కోరుతున్నారు.
భూమి విస్తీర్ణంలో కొంతే..
రైతుల భూమి విస్తీర్ణం పూర్తిస్థాయిలో పాస్బుక్లో నమోదు కావడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా వ్యవసాయ శాఖ రైతు యాప్ డౌన్లోడ్ చేసుకొని భూమి విస్తీర్ణం నమోదు చేసుకోవచ్చని బెబుతున్నా క్షేత్రస్థాయిలో కష్టతరంగా ఉంది. దీంతో యాప్లో చూపిన భూమికి మాత్రమే ఎరువు అందిస్తారు.
కౌలు రైతులకు మొండిచెయ్యి..
కొత్త విధానం ద్వారా కౌలు రైతులకు యూరియా, డీఏపీ ఎరువులు అందే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ఈ ఏడాది 90,600 మంది కౌలు రైతులు 2లక్షల 50 వేల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారని ప్రాథమిక అంచనా. వీరిలో సగం మందికి ఎరువులు అందే పరిస్ధితి లేదు. జిల్లాలో దేవదాయ శాఖ పరిధిలో 9650 ఎకరాల్లో ఈ ఏడాది వరి సాగు చేస్తున్నారని అంచనా. వీరికీ ఎరువులు అందడం అనుమానమే.


