● చిన్నారులను బయటకు తోసేసిన యజమాని
● ఇంటికి తాళాలు వేసిన వైనం
● అర్ధనగ్నంగా ఆరుబయట చిన్నారులు
ఇచ్ఛాపురం రూరల్: యజమాని, కింద పనిచేసేవా రి మధ్య జరిగిన గొడవ ఇచ్ఛాపురం మండలం పాయితారి గ్రామంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం పాయితారి గ్రామానికి చెందిన రైతు లోపింటి వెంకటరమణ వద్ద కోళ్ల మన్మధరావు గత ముప్పై ఏళ్లుగా పనిచేస్తున్నారు. వీరు దగ్గరి బంధువులు కూడా. దీనికి కృతజ్ఞతగా యజమాని వెంకటరమణ మన్మధరావుకు వివాహం కూడా జరిపించారు. పదేళ్ల కిందట తన ఇంటి పక్కనే ఇల్లు కట్టుకునేందుకు కూడా సమ్మతించారు. అయితే బుధవారం మన్మధరావు, వెంకటరమణ కుటుంబాలకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కొట్లాటకు దారి తీసింది. దీంతో ఇరువురు స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కొట్లాటలో గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తన కింద పనిచేసిన వ్యక్తి తిరుగుబాటు చేయడం సహించలేని రైతు వెంకటరమణ అదే రోజు సాయంత్రం ఇంటికి తాళం వేసేశాడని స్థానికులు చెబుతున్నారు. మన్మధరావు కుమారులు నరేష్, శ్రీనులు బడి విడిచిపెట్టిన తర్వాత బుధవా రం మధ్యాహ్నం తమ ఇంటికి చేరుకున్నాక ఇంటికి తాళం వేసి ఉండడం చూసి హతాశులయ్యారు. తగాదాల్లో మీ తల్లిదండ్రులు ఇచ్ఛాపురం ఆస్పత్రిలో ఉన్నారని, మీ ఇంటికి వెంకటరమణ తాళాలు వేసేశాడంటూ చెప్పడంతో చిన్నారులు తమ యజమానిని తాళాలు తీయాలంటూ వేడుకున్నారు. అయినప్పటికీ కనికరించని యజమాని ఇంటి దగ్గర నుంచి వెళ్లిపోవాలంటూ ఆగ్రహించడంతో చిన్నారులు ఆరుబయటే ఉండటం చూసిన స్థానిక సర్పంచ్ వలపల రంజిత చిన్నారులను చేరదీసి రాత్రి తన ఇంట్లో భోజనం పెట్టి నిద్రపుచ్చారు. గురువారం ఉగాది కావడంతో చిన్నారులు తమ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లడంతో ఆగ్రహించిన యజమాని నిర్దాక్షిణ్యంగా చిన్నారులను అర్ధనగ్నంగా బయటకు గెంటేసి తలుపులకు తాళాలు వేసేశాడు. స్థానికులు రూరల్ ఎస్ఐకు సమాచారం అందివ్వగా ఎస్ఐ జనార్ధనరావు ఇంటి తలుపులు తీయించి ఫొటోలు తీసి, ఆరుబయట ఉన్న పిల్లలు పరిస్థితిని చూసీ చూడనట్లు వ్యవహరించి మళ్లీ తాళాలు వేయించేశారని స్థానికులు చెబుతున్నారు.


