● మూత పడుతున్న రెస్టారెంట్లు
● విపరీతంగా పెరిగిన ఇండక్షన్ స్టవ్ ధరలు
● కట్టెలకూ పెరిగిన డిమాండ్
శ్రీకాకుళం: జిల్లావ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్లు లేక పలు రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడుతున్నా యి. గురువారం శ్రీకాకుళం నగరంలోని సుమారు 7 రెస్టారెంట్లు మూతపడ్డాయి. జిల్లావ్యాప్తంగా కూడా 40 వరకు రెస్టారెంట్లు మూతపడినట్లు తెలుస్తోంది. కొందరు మాత్రం గ్రామస్థాయి నుంచి సిలిండర్లను తెచ్చుకొని ఏదోలా రెస్టారెంట్లు నడుపుతున్నప్పటికీ ఇది అధిక భారం అవుతోంది. ఇలా గ్రామస్థాయిలో దొరికే సిలిండర్లు అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. బుధవారం ఒకటి రెండు రెస్టారెంట్లలో మాత్రమే కట్టెల పొయ్యిపై వంటలు చేయగా గురువారం దాదాపుగా ప్రతి హోటల్లోనూ కర్రల పొయ్యిను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి కొద్ది నెలలు ఇదే పరిస్థితి ఉంటుందని భావించిన కొందరు కరెంటుతో పని చేసే ఇండక్షన్ స్టవ్ల కోసం ఆరా తీస్తూ వచ్చారు. ఇదే అదనుగా ఆ స్టవ్ల ధరలు కూడా విపరీతంగా పెంచేసినట్లు సమాచారం. రెస్టారెంట్లే నడపలేకపోతున్న తరుణంలో ఇప్పటికే కొన్ని వివాహాది శుభకార్యాలకు వంటలు ఒప్పుకున్న కొందరు అవి ఎలా చేయాలో అన్న ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కట్టెలకు కూడా డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వం పునరాలోచన చేసి కొంతమేరైనా గ్యాస్ను సరఫరా చేయాలని పలువురు కోరుతున్నారు. లేకుంటే సిబ్బందికి జీతాలు, కరెంటు బిల్లులు చెల్లించే పరిస్థితి ఉండదని చాలా మంది తీవ్రంగా నష్టపోతారని హోటల్ రెస్టారెంట్లు యజమానులు అంటున్నారు.


