శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వంట గ్యాస్ సిలిండర్లపై రూ.60, వాణిజ్య సిలిండర్లపై రూ.115 పెంచడం ద్వారా ప్రజలపై భారీగా భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని ఏఐటీయూసీ సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొత్స సంతోష్ తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళం నగరంలో మున్సిపల్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకవైపు దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, మరోవైపు ప్రజలపై ఇలాంటి భారాలు మోపుతున్నారని, దీన్ని తీవ్రంగా ఖండించాలని అన్నారు. దేశంలో అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు అనేక రాయితీలు కల్పిస్తూనే సామాన్య ప్రజలపై పెను భారం మోపడం సరికాదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం జీఎస్టీ పేరుతో అనేక భారాలు మోపుతోందని, రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని, దీని కారణంగా రవాణా చార్జీలు భారీగా పెరుగుతాయని, కేంద్ర ప్రభుత్వం అన్ని నిత్యావసర వస్తువుల ధరలను పెంచడానికి సిద్ధమవుతోందని, ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.


