శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో పరాభవ నామ సంవత్సర (2026–27) నూతన పంచాంగాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.
పోలాకి పీహెచ్సీలో వివాదం
పోలాకి: పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీహెచ్ఈఓగా పనిచేస్తున్న నల్లి రవికుమార్, ఏఎన్ఎం కమల మధ్య వివాదం ముదిరి భౌతికదాడుల వరకూ వచ్చింది. రవికుమార్ పీహెచ్సీలో విధుల్లో ఉండగా తన భార్య పట్ల అసభ్యకరంగా మాట్లాడటానికి నీవెవరివి అంటూ ఏఎన్ఎం భర్త కరిమి శ్రీను మంగళవారం ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరికీ వివాదం జరిగింది. మాటామాటా పెరిగి ఆవేశంగా ఉన్న శ్రీను తన అనుచరులతో రవికుమార్పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రవికుమార్కు గాయాలయ్యాయి. రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీను తదితరులపై కేసు నమోదు చేశారు. ఇదే ఘటనపై ఏఎన్ఎం కమల కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్సై రంజిత్ తెలిపారు.
పాముకాటుతో వివాహిత మృతి
నరసన్నపేట: పెద్ద బొరిగివలసకు చెందిన ఇప్పిలి నీలవేణి(29) పాముకాటుకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందింది. మంగళవారం సాయంత్రం పశువులకు గడ్డి కోసేందుకు కలివరపుపేట షిర్డీ సాయి ఆలయం వైపు వెళ్లగా నాగుపాము కాటు వేసింది. అనంతరం స్థానికుల సహకారంతో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీలవేణి మృతి పట్ల వైఎస్సార్ సీపీ నాయకులు రాజాపు అప్పన్న, బగ్గు రమణయ్యలు సంతాపం వ్యక్తం చేశారు.


