సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి
ఇచ్ఛాపురం: తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో ఎటువంటి జంతు అవశేషాలు కలవలేదని సిట్ బృందం సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదిక నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు ఇప్పటికై నా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ నర్తు రామారావులు డిమాండ్ చేశారు. పట్టణంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో సమస్యలు, ఎన్నికల హామీలపై ప్రజల దృష్టిని మరల్చడానికే.. డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపారని మండిపడ్డారు. కేవలం రాజకీయ కుట్రతోనే నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన లడ్డూ వ్యవహారంతో భక్తుల మనోభావాలను దెబ్బతిన్నాయని, భక్తులందరికీ కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. లడ్డూ తయారీలో చేపనూనె, జంతు కొవ్వు కలిసిందని కూటమి నాయకులు ఆరోపణలు చేస్తూ పాపాలకు ఒడిగట్టారని దుయ్యబట్టారు. ఇటువంటి కుట్రలకు పాల్పడితే కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి తగిన శిక్షణ విధిస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రత్తి అన్వేష్, ఎస్సీ సెల్ కార్యదర్శి సల్లా దేవరాజు, ఎంపీపీలు బోర పుష్ప, పైల దేవదాస్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రకాశరావు పట్నాయక్, తడక జోగారావు, కాళ్ల సత్యం, కారింగి మోహన్రావు, ఎండీ షపీ తదితరులు పాల్గొన్నారు.


