రూ.కోటి దాటిన హుండీ కానుకల ఆదాయం
● అరసవల్లిలో నేడు కూడా కొనసాగనున్న హుండీ ఆదాయం లెక్కింపు ప్రక్రియ
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ హుండీ కానుకల లెక్కింపులో రికార్డు స్థాయిలో 60 రోజులకు గాను రూ.కోటికి మించి ఆదాయం లభించింది. తొలిరోజు మంగళవారం జరిగిన లెక్కింపులో మొత్తం రూ. 1,01,65,500 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ తెలియజేశారు. గత రెండు నెలల నుంచి ఆలయంలోని 19 హుండీల్లో లభించిన భక్తుల కానుకలను అనివెట్టి మండపంలో గట్టి భద్రత నడుమ లెక్కింపు చేపట్టారు. ఈ మేరకు నగదుతో పాటు బంగారం 30 గ్రాములు, వెండి 1700 గ్రాముల వరకు కానుకలు లభించినట్లుగా తెలియజేశారు. తొలిరోజు 17 హుండీలను తెరిపించగా బుధవారం మిగిలిన హుండీలను తెరిపించడంతో పాటు చిల్లరను కూడా లెక్కించనున్నామని ఈఓ తెలిపారు.


