పుట్టపర్తి అర్బన్: ప్రస్తుతం సాగు చేసిన వరి పంటలో పలు జాగ్రత్తలు పాటించి ఆశించిన దిగుబడులు సాధించాలని ఏరువాక జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రామసుబ్బయ్య పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5120 హెక్టార్లలో వరి పంట సాగు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం వరి పంట పిలక దశ నుంచి పొట్ట దశలో ఉందన్నారు. బుధవారం పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన అక్కడక్కడా పంటను నల్లి ఆశించినట్లు గుర్తించామన్నారు. దాని నివారణకు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిన్న, పెద్ద నల్లి పురుగులు ఆకుల అడుగు భాగానికి చేరుకొని రసం పీల్చడంతో ఆకులు పసుపు రంగులోకి మారి క్రమేపి ఎండిపోయినట్లుగా కనిపిస్తుందన్నారు. బెట్ట పరిస్థితుల్లో పురుగు ఉధృతి అధికంగా ఉంటుందన్నారు. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం పొడి మూడు గ్రాములు, లేకపోతే ప్రొఫినోపాస్ 2 మి.లీ లేకపోతే ఓమైట్ 1 మి.లీ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
కదిరి అర్బన్: మండల పరిధిలోని కదిరి కుంట్లపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆదినారాయణరెడ్డి (68) మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా ఆదినారాయణరెడ్డి కడుపునొప్పితో బాధపడుతుండేవాడని, ఈ క్రమంలో కడుపు నొప్ప భరించలేక ఆత్మహత్య చేసుకొని ఉంటాడని మృతుని బంధువులు చెబుతున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రి తరలించారు. రూరల్ మండల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు.
ఇసుక టిప్పర్ల పట్టివేత
ముదిగుబ్బ: కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మైనింగ్ అధికారులు బుధవారం జరిపిన ఆకస్మిక దాడుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న నాలుగు టిప్పర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మైనింగ్ అధికారులు అమీర్బాషా, సునీతబాయి మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టుబడిన టిప్పర్లను పోలీస్స్టేషన్కు తరలించారు.


