పుట్టపర్తి టౌన్: ‘మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అండదండలతో నల్లమాడలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారు’ అని వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం నేత ఎన్హెచ్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నల్లమాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నల్లమాడలో తమ తాత, ముత్తాలకు సంబంధించి సర్వేనంబర్ 136–1లో 8.47 ఎకరాల భూమి ఉందన్నారు. అందులో అన్నదమ్ములు 8 ఎకరాల భూమిని పంచుకోగా 47 సెంట్లు భూమి మిగులు భూమిగా ఉందని చెప్పారు. దానికి సంబంధించి మోదీనమ్మ, ఆలామ్మోలీ, ఎన్ బాషా పేరుమీద రికార్డులు కూడా ఉన్నాయన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీకి చెందిన సలాముల్లాఖాన్, రఫీఖాన్ కన్ను ఆ భూమిపై పడిందన్నారు. తాము కూడా వంశ వృక్షంలో ఉన్నామని, తమకు భూమి రావాలని మాపై గొడవకు దిగారన్నారు. తాము అంగీకరించకపోవడంతో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అండతో రెవెన్యూ, పోలీసులును ఆశ్రయించారన్నారు. అధికార పార్టీకి తలొగ్గిన అధికారులు ఇద్దరిని పిలిచి పంచాయితీ పెట్టి అందులో ఆరు సెంట్ల భూమి సలాంముల్లా, రఫీఖాన్కు ఇవ్వాలని, అధికారులకు మూడు సెంట్ల భూమి ఇవ్వాలని పంచాయితీ చేశారన్నారు. తాము ససేమీరా అనడంతో వైఎస్సార్సీపీ సానుభూతి పరులవి ఫేక్ వంశవృక్షమని మోదీనమ్మ, ఆలామ్మోలీ ,ఎన్హెచ్ బాషాపై అక్రమ కేసులు బనాయించి కదిరి కోర్టుకు తరలించారన్నారు. మహిళ అని కూడా చూడకుండా అర్ధరాత్రి సమయంలో అనంతపురం కోర్టుకు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పూచీ కత్తుతో తనను విడిచిపెట్టారని ఎన్హెచ్ బాషా తెలిపారు. నల్లమాడలో వైఎస్సార్సీపీకి పనిచేశామని, పదవులు కూడా తీసుకున్నామని ఏనాడూ ఎవరి భూములు లాక్కోలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూములు లాక్కొని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. మాట విని అధికారులకు మూడు సెంట్ల భూమి ఇచ్చివుంటే ఇదంతా జరిగివుండేది కాదన్నారు. ప్రాణాలు పోయినా సెంటు భూమి కూడా ఇచ్చేదిలేదని స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు
వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం నేత బాషా


