పుట్టపర్తి: ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని జిల్లా స్థాయి స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ కిష్టప్ప ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో పాఠశాలల పనితీరును పరిగణనలోకి తీసుకుంటామన్నారు. క్రీడాకారులు సాధించిన అత్యున్నత స్థాయి విజయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యాశాఖ పరిధిలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలూ ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసే పాఠశాలలు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులను సంబంధిత పీడీ, హెచ్ఎం చేత ధ్రువీకరించి సమర్పించాలన్నారు. ఈనెల 20వ తేదీలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలన్నారు.
బంగారు ఆభరణాల రికవరీ
హిందూపురం: పట్టణంలోని త్యాగరాజునగర్కు చెందిన వృద్ధురాలు రత్నమ్మ నాలుగు రోజుల క్రితం రూ.5 లక్షలు విలువ చేసే బంగారు గాజు, ఉంగరాన్ని పోగొట్టుకుంది. దీనిపై వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకుని పరిగి పోలీస్స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ అనిల్ ప్రత్యేక చొరవ చూపి పలు ప్రాంతాల్లో విచారించారు. అలాగే వృద్ధురాలు నగదు పోగొట్టుకున్న ప్రాంతంలోని సీసీ కెమెరాల ద్వారా రోడ్డుపై పడిపోయిన బంగారు ఉంగరం, గాజును తీసుకున్న వారిని గుర్తించారు. వారిని సంప్రదించి ఆభరణాలను రికవరీ చేశారు. మంగళవారం వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఎస్ఐ రాజేష్ సమక్షంలో రికవరీ చేసిన బంగారాన్ని వృద్ధురాలికి అందజేశారు. ప్రత్యేక చొరవ చూపిన పీసీ అనిల్ను ఎస్ఐ రాజేష్ అభినందించారు. అలాగే కానిస్టేబుల్ అనిల్కు వృద్ధురాలు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి పంటకూ ఈ–క్రాప్ బుకింగ్ చేసుకోవాలి
చిలమత్తూరు: పంట సాగు చేసిన ప్రతి రైతూ ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మండల పరిధిలోని దేమకేతేపల్లిలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోందని, వర్షాధార రైతులు విత్తనాలను ఫెలిటైజేషన్ చేసుకోవాలని సూచించారు. ఎల్నినో నష్టాలు తీవ్రంగా ఉంటాయని, ఈ క్రాప్ బుకింగ్ ద్వారానే పంట నష్ట పరిహారం అందుతుందన్నారు. అనంతరం పంటల సాగుపై అవగాహన కల్పించారు.


