అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం
ప్రశాంతి నిలయం: వీబీజీ రామ్జీ పథకం కింద గ్రామాల్లో ఉపాధి పనులు పెంచాలని, ఇందుకోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీబీజీ రామ్జీ, ఉద్యాన తోటల పెంపకం, పశుసంవర్దక శాఖ పనితీరుపై సమీక్షించారు. జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, లక్ష్యాలు, పురోగతిపై చర్చించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీబీజీ రామ్జీ పథకం అమలులో కదిరి, నల్లచెరువు, ఓబులదేవర చెరువు, రొద్దం మండలాలు వెనుకబడి ఉన్నాయని, ఆయా మండలాల్లో ఉపాధి పనుల పురోగతి పెంచాలన్నారు. ప్రస్తుతం అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నందున ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పశుగ్రాసం కొరత రాకుండా చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో గడ్డి పెంచాలన్నారు. పాడి రైతులకు 30 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు ఉచితంగా అందించాలని, 50 శాతం సబ్సిడీపై 800 మెట్రిక్ టన్నుల దాణా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
పూడికతీత పనులను వేగవంతం చేయండి
జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో చేపట్టిన మురుగుకాల్వల్లో పూడికతీత పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘన వ్యర్థాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, ప్రజా సేవల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో అన్నా క్యాంటీన్ల నిర్వహణ, ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ, మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు.
9 నుంచి జిల్లాలో ‘హర్ ఘర్ తిరంగా’
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 9వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా–2026’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. 17వ తేదీ వరకూ విస్తృత స్థాయిలో దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ ఐక్యత, జాతీయ పతాకంపై గౌరవాన్ని పెంపొందించేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో తిరంగా ర్యాలీలు బైక్, సైకిల్, ఈ–బైక్ ర్యాలీలు, దేశభక్తి పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు, వందేమాతర గీతం సామూహిక గానం, సెల్ఫీ విత్ తిరంగా ప్రచారం, తిరంగా ప్రదర్శనలు, ప్రభుత్వ భవనాలకు తివర్ణంలో విద్యుత్ దీపాలంకరణ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈనెల 14వ తేదీన విభజన బీభత్స స్మృతి దినం నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
‘బాలికే భవిష్యత్తు’ను
విజయవంతం చేయండి


