పెనుకొండ రూరల్: జయంతి, వర్ధంతి రోజుల్లో అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చే అధికారులు ఆ మహనీయుడి విగ్రహం కళ్లముందే చెత్త వాహనాల మధ్య కనిపిస్తున్నా పట్టించుకోవడం లేదు. కానీ వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తున్న వారు బాబాసాహెబ్ విగ్రహం దుస్థితి చూసి అధికారులపై పెదవి విరుస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పెనుకొండలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని గతంలో ఇక్కడ పనిచేసిన ఓ అధికారి నిర్ణయించారు. ఇందుకోసం ఇతర ప్రాంతం నుంచి ఆ మహనీయుడి విగ్రహాన్ని తెప్పించారు. ఆ తర్వాత ఆ అధికారి బదిలీపై మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత వచ్చిన అధికారులెవరూ అంబేడ్కర్ విగ్రహం గురించి పట్టించుకోలేదు. దీంతో రాజ్యాంగ నిర్మాత విగ్రహం చెత్త తరలించే వాహనాల మధ్యకు చేరింది. నగర పంచాయతీ కార్యాలయ ఆవరణలోని ఆర్డీఓ సమావేశ భవనం పక్కనే ఉన్న ఈ విగ్రహం అందరికీ కనిపిస్తున్నా...ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే వారు ఇంతపెద్ద ఊళ్లో రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి చోటే లేదా...అధికారులకు అంత తీరిక లేదా అని మండిపడుతున్నారు.
చెత్త వాహనాల మధ్య రాజ్యాంగ నిర్మాత విగ్రహం


