లేపాక్షి: బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగనామం పెట్టిన పెత్తందారులకు ప్రధాని మోదీ కొమ్ముకాస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. బుధవారం లేపాక్షిలో జరిగిన సీపీఐ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతాంగం పట్ల కనీస ఆలోచన చేయని ప్రధాని మోదీ ఇక దేశానికి ఏమి చేస్తారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ ప్రాంతాల్లో నదులను అనుసంధానం చేసి కోట్ల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న మాటలు నీటిమూటలయ్యాయని దుయ్యబట్టారు. దేశాన్ని మోదీ ఏమి అభివృద్ధి చేస్తాడంటూ ఒకప్పుడు నిలదీసిన చంద్రబాబు ప్రస్తుతం బీజేపీ జెండా, అజెండాను తలమీద మోస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేయడం, జైళ్లకు పంపడం, భయభ్రాంతులకు గురి చేయడం రివాజుగా మారిందని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్, రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిండెంట్ కాటమయ్య, జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్, రాష్ట్ర మహిళా సమాఖ్య నాయకురాలు పద్మావతమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు కనిశెట్టిపల్లి వినోద్కుమార్, శివప్ప, మండల కార్యదర్శి గౌతమ్కుమార్, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఫ్ నాయుకులు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు మోస్తోంది బీజేపీ అజెండానే
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
గుజ్జుల ఈశ్వరయ్య మండిపాటు


