రొద్దం: అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం.. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ దుర్మార్గ పాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ఇప్పటికై నా అధికార పార్టీ నేతలు విమర్శలు మాని ప్రజలకు మంచి జరిగేలా అభివృద్ధి చేయాలని సూచించారు. శనివారం సాయంత్రం ఆమె మండల పరిధిలోని కంచిసముద్రం గ్రామంలో ‘కాఫీ విత్ వైఎస్సార్ సీపీ లీడర్స్’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి చంద్రబాబు ప్రభుత్వం పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీనైనా అమలు చేశారా...అని కూటమి నేతలను ఆమె ప్రశ్నించారు. కనీసం ఆరోగ్యశ్రీ కూడా సరిగా అమలు చేయకపోవడంతో వ్యాధుల బారిన పడిన నిరుపేదలు ఆస్తులు అమ్మి చికిత్సలు చేయించుకుంటున్నారని మండిపడ్డారు. ఇక ఎన్నికల సమయంలో మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు చేయడంతో పూర్తిగా విఫలమైందన్నారు. నిరుదోగ్య భృతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ హామీ ఏమైందో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు చేయకుండా నిత్యం జగనన్నపై విమర్శలు చేయడం తప్ప..ప్రజలకు మంత్రి చేసిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎన్.నారాయణరెడ్డి, సి.నారాయణరెడ్డి, చిన్న, లక్ష్మీనారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
‘కాఫీ విత్ వైఎస్సార్సీపీ లీడర్స్’లో
ఉషశ్రీచరణ్


