గరుడ వాహనంపై దేవదేవుడు | - | Sakshi
Sakshi News home page

గరుడ వాహనంపై దేవదేవుడు

Mar 5 2026 7:17 AM | Updated on Mar 5 2026 7:17 AM

కదిరి: అశేష భక్త జన గోవింద నామస్మరణల మధ్య ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బుధవారం గరుడ వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలకు అధిపతి అయిన బ్రహ్మదేవుడు తనకు ఇష్ట వాహనమైన గరుత్మంతున్ని నారసింహుడికి వాహనంగా పంపుతారని, అందుకే ఈ ఉత్సవాన్ని బ్రహ్మ గరుడ సేవ అంటారని అర్చక పండితులు నరసింహాచార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సమస్త వాహనాల్లో సర్వ శ్రేష్టమైన గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుందని, ఇహ పరమైన ఈతి బాధల నుండి విముక్తి కల్గుతుందని భక్తుల నమ్మకం. నారసింహుని బ్రహ్మోత్సవాల సమయంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడే కాబట్టి...ఈ వాహన సేవకు అంతటి ప్రాధాన్యత ఉంది.

రాజగోపురం వద్ద దర్శనం కోసం...

తమ ఇష్టదైవం ఖాద్రీశుడు తూర్పు రాజగోపురం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ‘శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవింద’ అని భక్తులు కీర్తించగా..ఆ ప్రాంతం మార్మోగింది. బ్రహ్మ గరుడ సేవలో ప్రధాన గోపురం వద్ద స్వామి వారిని దర్శించుకుంటే మరింత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు తమ ఇలవేల్పును అక్కడ దర్శించుకోవడానికి పోటీ పడ్డారు. విద్యుద్దీపాలంకరణ, కదిరి మల్లెలతో శ్రీవారిని విశేషంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉత్సవ ఉభయదారులుగా కుటాగుళ్లకు చెందిన బేరి వర్తకులు నారాయణప్ప శెట్టి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

నేడు శేషవాహనం..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం(నేడు)లక్ష్మీ నారసింహుడు శేషవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

నృసింహాలయంలో పోటెత్తిన భక్తజనం

గోవింద నామస్మరణతో

మార్మోగుతున్న ఖాద్రీ క్షేత్రం

భక్తులను అలరిస్తున్న

సాంస్కృతిక కార్యక్రమాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement