నిండు ప్రాణాన్ని బలిగొన్న యూటర్న్
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం బళ్లారి రోడ్డు ఎంవైఆర్ ఫంక్షన్ హాలు దాటిన తర్వాత కొత్తగా నిబంధనలకు విరుద్ధంగా తీసిన ‘యూటర్న్’కు ఓ యువకుడు బలయ్యాడు. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు... రూరల్ మండలం నరసనాయనికుంటకు చెందిన హరిజన ఓబులేసుకు ముగ్గురు కుమారులు సంతానం. రెండో కుమారుడు హరిజన నరేష్ (19) బైకు మెకానిక్ షెడ్డులో పని చేస్తున్నాడు. తండ్రి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వీరు అనంతపురం నగరంలోనే నివాసం ఉంటున్నారు. సొంతూరులో వ్యవసాయ భూమి ఉంది. ఇటీవల కంది పంట కోశారు. కందులు కళ్లంలో వేశారు. కాపలా కోసమని నరేష్ అన్న అక్కడే ఉంటున్నాడు. శనివారం రాత్రి భోజనం క్యారీ ఇచ్చేందుకు నరసనాయనికుంటకు వెళ్లిన నరేష్ రాత్రి ఇంటికి తిరుగుముఖం పట్టాడు. 9.30 గంటల సమయంలో అనంతపురం నుంచి వస్తున్న ఓ కారు కొత్త యూటర్న్ వద్ద తిరుగుతోంది. ఇదే సమయంలో సిండికేట్నగర్ వైపు నుంచి వచ్చిన బైకు కారును ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నరేష్ను చికిత్స నిమిత్తం బెంగళూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


