నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక
ప్రశాంతినిలయం:కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పోలీస్ కార్యాలయంలో..
పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీసతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయాలని సూచించారు. ఆధార్కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు.
హేమావతి సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
అమరాపురం: మండల పరిధిలోని హేమావతి గ్రామంలో వెలసిన సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అర్చకులు స్వామి వారికి ఉదయం త్రికాల పూజలైన సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, అఖండ పూజలను నిర్వహించారు. భక్తులు తెచ్చిన వివిధ పూలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్వామి వారిని దర్శించు కుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఆలయ అర్చకులు ప్రసాద వినియోగం చేశారు. రాత్రి భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు.
ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
మడకశిర: అమరాపురం మండలం హేమావతి సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులను నడపనున్నట్లు మడకశిర డిపో మేనేజర్ రంగభాష్యం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం అగ్నిగుండం రోజు 20 ప్రత్యేక సర్వీసులను అమరాపురం, మడకశిర, అగళి, రొళ్ల, గుడిబండ మండలాల నుంచి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బ్రహ్మరథోత్సవం రోజు(శుక్రవారం) కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అంతా మా ఇష్టం..
● గోరంట్ల మండలం రెడ్డిచెరువుపల్లిలో టీడీపీ నేతల బరితెగింపు
సాక్షి, పుట్టపర్తి:గోరంట్ల మండలం రెడ్డిచెరువుపల్లిలో టీడీపీ నేతలు బరితెగించారు. ఆదాయం కోసం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. గ్రామంలో బాగున్న పాఠశాల భవనాన్ని కూల్చి వేసి ఆగమేఘాలపై అక్కడ పంచాయతీ భవన నిర్మాణాన్ని చేపట్టారు. పాఠశాల భవనాన్ని కూల్చివేసేందుకు.. కొత్తగా పంచాయతీ భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి సవిత ప్రోద్బలంతోనే ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు చెబుతుండడం గమనార్హం. పంచాయతీ భవన నిర్మాణం కోసం వేస్తున్న బేస్మెంట్ కూడా బలంగా లేదని, నాసిరకంగా నిర్మాణం చేపడుతున్నా రని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక


