గిరిజనుల ఆరాధ్యుడు సంత్‌ సేవాలాల్‌ | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల ఆరాధ్యుడు సంత్‌ సేవాలాల్‌

Feb 9 2026 8:16 AM | Updated on Feb 9 2026 8:16 AM

గిరిజ

గిరిజనుల ఆరాధ్యుడు సంత్‌ సేవాలాల్‌

‘సాతీ భవానీ (సప్త మాతృకల)’ పూజా విధానాలు ఆచరించే బంజారాల జాతికి ఆయనే దార్శనికుడు. తనదైన బోధనలతో బంజారాల మనసు గెలుచుకుని.. వారిని భాషపరంగా ఏకతాటిపైకి తెచ్చి.. ధర్మమార్గంలో నడిచేలా చేశారు. లిపిలేని బంజారాల భాషను ఒక పద్ధతిగా మార్చాడు. మానవాళికి ధర్మమార్గాన్ని అలవాటు చేసేందుకు ఈ భువిపై వెలసిన ఆయనే సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌. కారణజన్ముడిగా బంజారాలు ఆరాధించే సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంత్యుత్సవాలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

గుత్తి రూరల్‌: అనంతపురం జిల్లా మండలంలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీ సేవాగఢ్‌లో సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ 287వ జయంత్యుత్సవాలు ఈ నెల 13, 14, 15 తేదీలలో ఘనంగా జరగనున్నాయి. తమ ఆరాధ్య దైవమైన సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జన్మస్థలమైన సేవాఘడ్‌లో జరిగే ఈ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలు అశేషంగా హాజరవుతారు. 14న శనివారం రాత్రి జ్యోతి ప్రజ్వలనతో సేవాలాల్‌ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

సేవాగఢ్‌ విశిష్టత

గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలోని రాంజీనాయక్‌ తండాలో భీమా నాయక్‌, ధర్మిణి బాయి దంపతులకు 1739, ఫిబ్రవరి 15న సేవాలాల్‌ జన్మించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. తండ్రి భీమానాయక్‌ ఆ తండాకు పెద్ద దిక్కుగా ఉండేవారు. గ్రామంలో రచ్చబండపై పంచాయితీ తీర్పులు ఇచ్చేవారు. అ కట్టను భీమానాయక్‌ కట్టగా పిలుస్తుంటారు. ఈ కట్టకు ఎదురుగా ఉన్న బావిలో అక్కమ్మ దేవతలు స్నానం చేసేవారని, దీంతో ఆ బావిని పవిత్ర ‘కాళోకుండ్‌’గా పిలుస్తుంటారు. ఈ బావిలోనే సేవాలాల్‌ మహరాజ్‌ అప్పట్లో స్నానం ఆచరించి, భీమానాయక్‌ కట్టపై కూర్చొని తన ఆధ్యాత్మిక బోధనలతో బంజారాల్లో చైతన్యం తీసుకువచ్చినట్లుగా భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ కాళోకుండ్‌ దగ్గరలో రూ.1.2కోట్లతో దండం మోరో మాత (మారెమ్మ దేవత) ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారి ఆశీర్వాదంతో అన్ని విద్యలూ నేర్చుకుని బంజారాల సేవలో నిమగ్నమైన సేవాలాల్‌.. తన ఆధ్యాత్మిక బోధనలతో జాతిని ఏకతాటిపైకి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. ఇందులో ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులు అరికట్టడం, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం మొదలైనవి ముఖ్యమైనవి.

దేశంలోనే అరుదైన ఆలయం

దాదాపు పాతిక సంత్సరాల క్రితం వరకూ సేవాగఢ్‌ ప్రాంతం నిర్జనమైన కొండ గుట్టలతో నిండి ఉండేది. చారిత్రక ఆధారాలను పరిశీలించిన అనంతరం రూ. కోటి వ్యయంతో అక్కడ సేవాలాల్‌ ఆలయాన్ని బంజారా నాయకుడు రంజిత్‌ నాయక్‌ నిర్మించారు. ఆలయ నిర్మాణానికి బంజారాలను ఏకం చేసి విరాళాలు సేకరించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం ఓ పుణ్యక్షేత్రంగా మారిపోయింది. 2000 సంవత్సరంలో మొట్టమొదటి సారి సేవాలాల్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా క్రమం తప్పకుండా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఉత్సవాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న బంజారాలు పాల్గొని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సేవాలాల్‌ మహరాజ్‌ ఆలయ పరిసరాల్లోనే రూ.1.2కోట్లతో మారెమ్మ (మాతా జగదాంబ) ఆలయాన్ని నిర్మించారు.

ఇక్కడికి ఇలా చేరుకోవచ్చు

సేవాఘడ్‌కు గుత్తి బస్టాండ్‌ నుంచి నేరుగా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. రైలులో గుత్తి, గుంతకల్లు స్టేషన్లకు వచ్చిన భక్తులు ఆటోల ద్వారా బస్టాండులకు చేరుకొని ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాల్సి ఉంటుంది. సొంత వాహనాల్లో ప్రయాణించేవారు గుత్తి–గుంతకల్లు మార్గంలో గొల్లలదొడ్డి క్రాస్‌ నుంచి లోపలకు మూడు కిలోమీటర్ల దూరం వెళితే సేవాలాల్‌ ఆలయం వస్తుంది.

భారతదేశంలోనే ఏకై క ఆలయం ‘సేవాగఢ్‌’

నాడు కొండ గుట్టల ప్రాంతం.. నేడు పుణ్య క్షేత్రం

సేవాగఢ్‌లో 13 నుంచి జయంత్యుత్సవాలు

గిరిజనుల ఆరాధ్యుడు సంత్‌ సేవాలాల్‌ 1
1/1

గిరిజనుల ఆరాధ్యుడు సంత్‌ సేవాలాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement