నేత్రదానంతో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు
బత్తలపల్లి: నేత్రదానంతో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని విశ్వదీప సేవా సంఘం సభ్యులు అన్నారు. మండల కేంద్రమైన బత్తలపల్లి ఓసీ కాలనీకి చెందిన పల్లపోతుల రామలక్ష్మమ్మ (78) శనివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ధర్మవరం పట్టణంలోని విశ్వదీప సేవా సంఘం సభ్యులు ఆమె కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించారు. ఆమె కుమారుడు గణేష్ (గణేష్ సిమెంట్ బ్రిక్స్), కోడలు శ్రీలక్ష్మీ, మనవ రాళ్లు సుస్మిత, దీక్షిత, కుమార్తె సుగుణమ్మ, అల్లుడు కృష్ణప్ప, స్టోర్ ప్రకాష్, పి.గోపాల్ అంగీకారంతో అనంతపురం రెడ్క్రాస్ డీవై కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషియన్ జి.రాఘవేంద్ర రామలక్ష్మమ్మ కంటి కార్నియా సేకరించారు. కుటుంబ సభ్యులకు విశ్వదీప సేవా సంఘం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సేవా సంఘం ఫౌండర్ కోళ్లమొరం చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ మరణించిన మనిషి మన మధ్య లేకపోయినా వారి నేత్రాలు జీవించి ఉంటాయన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు గాజుల సురేష్, కార్యదర్శి జూజారు రఘు, టి.చంద్రశేఖర్రెడ్డి, ధనుంజయ, సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మాస్టర్
అథ్లెటిక్స్కు ఎంపిక
గుంతకల్లుటౌన్: పట్టణంలోని ఎస్జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న జ్యోతి అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 2వ తేదీన రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన జాతీయస్థాయి 7వ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో (40 సంవత్సరాల వయస్సు పైబడిన) జ్యోతి 800 మీటర్ల పరుగు పందెం, ట్రిపుల్ జంప్లో ప్రతిభ కనబరిచి ద్వితీయస్థానంలో నిలిచినట్లు పాఠశాల హెచ్ఎం గోపాల్రెడ్డి, పీడీ ఎంకె.రాజేష్ తెలిపారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో గుంతకల్లు ఎంఈఓలు మస్తాన్రావు, సుబ్బరాయుడు, డీ.హీరేహాళ్ ఎంఈఓ వేణుగోపాల్లు పాల్గొని జ్యోతిని అభినందించారు. జాతీయస్థాయి అథ్లెటిక్స్లో ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన ఆమె త్వరలో జరగబోయే అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని ఎంఈఓలు, హెచ్ఎం పేర్కొన్నారు.
నేత్రదానంతో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు
నేత్రదానంతో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు


