చిరుత దాడిలో 12 గొర్రెల మృతి
గుమ్మఘట్ట: మండలంలోని రంగసముద్రం గ్రామంలో గొర్రెల మందపై చిరుత దాడి చేయడంతో 12 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. స్థానికులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన అనిల్కుమార్ తన 60 గొర్రెలను మందగా తోలాడు. అర్ధరాత్రి సమయంలో మందపై చిరుత దాడి చేసింది. 12 గొర్రెలను తీవ్రంగా గాయపరచడంతో మృత్యువాత పడ్డాయి. రూ.2 లక్షల నష్టం జరిగినట్లు బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదరరెడ్డి, పశు వైద్యులు నవీన్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంజినేయులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రభుత్వం బాధితునికి పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
బియ్యం వ్యాపారి బలవన్మరణం
తాడిపత్రిటౌన్:బియ్యం వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో జరిగింది. సీఐ ఆరోహణరావు తెలిపిన మేరకు.. పట్టణంలోని మెయిన్ బజార్లో నరేంద్రకుమార్ (45), భార్య రజనీకుమారి, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. స్థానిక వైఎస్సార్ సర్కిల్లో నరేంద్రకుమార్ కిరాణ స్టోర్ నడుపుతున్నాడు. 10 సంవత్సరాలుగా బియ్యం వ్యాపారం కూడా చేస్తున్నాడు. వ్యాపార నిమిత్తం నరేంద్రకుమార్ అప్పులు చేశాడు. ఇటీవల వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆవేదనలో కూరుకుపోయాడు. అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడంతో మంగళవారం కిరాణా స్టోర్లోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
సరిహద్దు ప్రాంతాల్లో
పటిష్ట నిఘా
రాయదుర్గం: ఉమ్మడి జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేశామని, ఒక్క బాక్సు కర్ణాటక మద్యం కూడా దిగుమతి కాకుండా చర్యలు చేపట్టామని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య,ఈఎస్ రామమోహన్రెడ్డి తెలిపారు. మంగళవారం రాయదుర్గం ఎక్సైజ్ పోలీస్స్టేషన్ను సీఐ జయనాథ్రెడ్డితో కలిసి సందర్శించారు. స్థానిక ఎస్హెచ్ఓ (సీఐ) మహేష్కుమార్ ఆధ్వర్యంలో బార్ పాలసీపై డీసీ, ఈఎస్ అవగాహన కల్పించారు. బార్ లైసెన్స్ దరఖాస్తు విధానాలు, అర్హతలు, రుసుం, స్లాబు వివరాలు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం డీసీ, ఈఎస్లు సిబ్బంది సమావేశంలో మాట్లాడారు. లోక్ అదాలత్ కేసులపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సీఐ ఉత్తమ అవార్డులకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.
చింతచెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి
పెద్దవడుగూరు: చింతచెట్టు పైనుంచి జారి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధి లోని విరుపాపురం గ్రామంలో జరిగింది. ఎస్ఐ ఆంజినేయులు తెలిపిన మేరకు.. నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన శ్రీనివాసులు (46)కు భార్య పుష్పలత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాసులు చింతకాయల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల పెద్దవడు గూరు మండలంలోని విరుపాపురం సమీపంలో చింత చెట్లు కొనుగోలు చేశాడు. మంగళవారం చెట్లు ఎక్కి చింతకాయలు కోస్తుండగా అదుపుతప్పి కిందకు జారిపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికుల సాయంతో భార్య గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధరించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
కొండుపల్లి గనిలో ప్రమాదం
● ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు
పెద్దవడుగూరు: మండల పరిధిలోని కొండుపల్లి గనిలో ప్రమాదం చోటు చేసుకొంది. ఇద్దరు కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున కొండుపల్లి గనిలో డోలమైట్, బలపం రాయిని వెలికి తీసేందుకు కొండుపల్లికి చెందిన గొల్ల నరేష్, బోయ అనిల్ వెళ్లారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా బలపం రాళ్లు మీద పడడంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని తోటి కార్మికులు వెంటనే అనంతపురంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.
చిరుత దాడిలో 12 గొర్రెల మృతి


