కలెక్టర్ను కలిసిన గ్రూప్–1 విజేత
ప్రశాంతినిలయం/పుట్టపర్తి టౌన్: లేపాక్షి గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి సురేష్ గ్రూప్–1 పరీక్షల్లో సత్తా చాటి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన పుట్టపర్తిలో కలెక్టర్ శ్యాం ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్కు పూల మొక్క అందజేసి శాలువ కప్పి సత్కరించారు. కార్యక్రమంలో విశ్రాంత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రామప్ప, సురేష్ గురువులు ప్రసాద్, రమణారెడ్డి, సూపరింటెండెంట్ రమణ, పూర్వ అధ్యక్షుడు రామాంజి తదితరులు పాల్గొన్నారు.
వంద అరటి చెట్లు నరికివేత
● రూ.లక్ష వరకు పంట నష్టం
కనగానపల్లి: గుర్తుతెలియని వ్యక్తులు వంద అరటి చెట్లను నరికివేసిన ఘటన కనగానపల్లి సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేర కు.. కనగానపల్లికి చెందిన రైతు సత్యనారాయణ రెండు ఎకరాల పొలంలో 3 వేల అరటి మొక్కలు నాటాడు. ప్రస్తుతం అరటి గెలలు కోత దశలో ఉన్నాయి. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పొలంలోకి ప్రవేశించి వంద చెట్లను నరికివేశారు. దీంతో రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు గ్రామంలో ఎవరితోనూ విభేదాలు లేవని తెలిపాడు. దీనిపై మంగళ వారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ రిజ్వాన్ కేసు నమోదు చేశారు. పొలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
మామపై అల్లుడి దాడి
పరిగి: కోనాపురం గ్రామంలో మామపై అల్లుడు దాడి చేసిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్ఐ రంగడు యాదవ్ తెలిపిన వివరాలు... ఒడిషా రాష్ట్రం గంజామ్ జిల్లా బరంపుర గ్రామానికి చెందిన సనాతన్ తన కుటుంబ సభ్యులతో కలిసి 30 ఏళ్ల క్రితం పరిగి మండలానికి వలస వచ్చాడు. మోదా పంచాయతీ పరిధిలోని కోనాపురంలో నివాసముంటున్న సనాతన్కు ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్ వస్తోంది. తాగుడుకు బానిసైన ఇతని అల్లుడు ప్రశాంత్ డబ్బుల కోసం తరచూ సనాతన్తో గొడవ పడేవాడు. మంగళవారం సాయంత్రం యథావిధిగా డబ్బులడిగాడు. ఇవ్వకపోవడంతో కొడవలితో సనాతన్పై దాడి చేయగా అతడి చేయి, తలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు హుటాహుటిన హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సనాతన్ ఫిర్యాదు మేరకు ప్రశాంత్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
కలెక్టర్ను కలిసిన గ్రూప్–1 విజేత


