‘పల్లె’ సార్ చెప్తేనే పింఛన్ !
ఓడీచెరువు: వృద్ధులకిచ్చే పింఛన్లోనూ రాజకీయ వైరం చూపుతున్నారు. అర్హత ఉండి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా సరే ‘పల్లె’ సార్ చెబితేనే పింఛన్ మొత్తం ఇస్తామంటూ అధికారులు వృద్ధులను వేధిస్తున్నారు. రాజకీయ కారణాలతో కొందరికి నాలుగు నెలలుగా పింఛన్ ఇవ్వకుండా ఆ తర్వాత స్థానికంగా లేరంటూ జాబితా నుంచి తీసేస్తున్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న ఈ అమానవీయ ఘటనలు తెలిసి జనం పాలకులపై దుమ్మెత్తి పోస్తున్నారు.
సార్తో ఫోన్ చేయించండి..
ఓడీచెరువు మండలం కొండకమర్ల పంచాయతీ చెరువుమునెప్పపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి, ఎనుమల వెంకటశివారెడ్డి, చెరువు చిన్నపరెడ్డి ఏళ్లుగా వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలవుదీరాక వీరిపై రాజకీయంగా కక్షగట్టారు. వృద్ధులు, ఏ ఆసరా లేని వారిని బలిచేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వారికి పింఛన్ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇందులో ఎనుమల వెంకటశివారెడ్డి, చెరువు చిన్నపరెడ్డికి నాలుగు నెలలుగా పింఛన్ డబ్బులు ఇవ్వడం లేదు. శ్రీనివాసరెడ్డికి మూడు నెలలుగా పింఛన్ మొత్తం అందించకుండా వేధిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం వారు తమకు పింఛన్ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా ఎంపీడీఓ సార్ ఆపమన్నాడని సమాధానం ఇచ్చారు. ఎంపీడీఓను పింఛన్ డబ్బులిప్పించాలని అభ్యర్థించగా.. ‘‘పల్లె సార్ ఆపమన్నాడు, పల్లె సార్ దగ్గరికిపోయి ఫోన్ చేయిస్తేనే మీ పింఛన్ ఇస్తాం’’ అని చెప్పారు. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చేతనయితే సాయం చేయాలి గానీ... ఇలా కీడు చేస్తారా అని మండిపడ్డారు. శ్రీనివాసరెడ్డి ఫించన్ ఈ నెల ఆపితే మూడు నెలలు గడిచిపోతుందని.. అప్పుడు పింఛన్ జాబితా నుంచి పేరు తొలగిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇక చిన్నప్ప, వెంకటశివారెడ్డిల పేర్లు పింఛన్ జాబితా నుంచి గతనెలలోనే తొలగించారు. గతంలో కూడా వీరిని ఇదే విధంగా ఇబ్బందులకు గురిచేయగా.. విషయం తెలుసుకున్న అప్పటి కలెక్టర్ ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించి ఎంపీడీఓ కార్యాలయ అధికారులను మందలించడంతో అదే రోజు వారికి పింఛన్ అందించారు.
పుట్టపర్తి నియోజకవర్గంలో
అధికారుల వింత వైఖరి
గతంలో పింఛన్ అందుకుంటున్న వారికీ నెలలుగా మొండిచేయి
నాలుగు నెలల తర్వాత స్థానికంగా లేరంటూ పింఛన్ రద్దు
‘పల్లె’ సార్ చెప్తేనే పింఛన్ !


