వీరభద్రుని సేవలో ఐఏఎస్ సోనాల్ గోయెల్
లేపాక్షి: ఐఏఎస్ అధికారిణి, న్యూఢిల్లీలోని త్రిపుర భవన్ స్పెషల్ రెసిడెంట్ కమిషనర్ సోనాల్ గోయెల్ శనివారం లేపాక్షిలో వెలసిన వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోనాల్ గోయెల్ ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, వారి సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించారు. తహసీల్దార్ సౌజన్యలక్ష్మితో పాటు రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఆమె వెంట ఉన్నారు.
కేంద్ర గ్రంథాలయ
కార్యదర్శిగా కమ్మన్న
అనంతపురం కల్చరల్: ఉమ్మడి జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శిగా పోలుగల్లు కమ్మన్న శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇంత వరకు కార్యదర్శిగా పనిచేసిన రమ పదవీ విరమణ చేయడంతో ఆ బాధ్యతలను గ్రంథాలయాల శాఖా సంచాలకుడు కమ్మన్నకు అప్పగించారు. ఇది వరకు ఆయన డిప్యూటీ లైబ్రేరియన్గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలకు మరింతగా పాఠకులు వచ్చేలా, కవులు, రచయితలను భాగస్వాములను చేస్తూ వివిధ కార్యక్రమాలను చేపడతామన్నారు.
● పదవీ విరమణ చేసిన రమను గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం నాయకులు ప్రతాపరెడ్డి, జయరాం, రాజు, రవికుమార్ నాయుడు, శ్రీనివాసులు, రామాంజనమ్మ, గోవిందు, బుల్లె శంకర్, వీరనారాయణరెడ్డి, శ్రీపతి తదితరులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.
పోలీస్ డైరీ ఆవిష్కరణ
పుట్టపర్తి టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం రూపొందించిన పోలీస్ డైరీ–2026ను ఎస్పీ సతీష్కుమార్ శనివారం స్థానిక సాయి ఆరామంలో ఆవిష్కరించారు. డైరీలో పోలీస్ అధికారులు, సిబ్బందికి అవసరమయ్యే కీలక సమాచారాన్ని పొందుపరచడంపై ఎస్పీ హర్షం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డీఎస్పీలు నరశింగప్ప, శివన్నారాయణస్వామి, ఇందిరా, విజయకుమార్, హేమంత్కుమార్, ఎస్బీ సీఐ వెంకటేశ్వర్లు, రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం కమిటీ సభ్యులు సూర్యకుమార్, దాదాపీర్, పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
గొర్రెల కాపరి దుర్మరణం
కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లి సమీపంలో కనగానపల్లి రహదారిలో శుక్రవారం రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు కనగానపల్లికి చెందిన గొర్రెల కాపరి కుంటాల ఆదినారాయణ (42) కుమారుడు బన్నితో కలిసి మామిళ్లపల్లి సమీపంలో ఉన్న తన గొర్రెల మంద వద్దకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక్కసారిగా టైరు పంక్చర్ కావడంతో రోడ్డు పక్కనే ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు బన్ని స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకొన్న మృతుని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతునికి భార్య వరలక్ష్మి, ఒక కుమారుడు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కనగానపల్లి ఎస్ఐ రిజ్వాన్ తెలిపారు.
వీరభద్రుని సేవలో ఐఏఎస్ సోనాల్ గోయెల్
వీరభద్రుని సేవలో ఐఏఎస్ సోనాల్ గోయెల్
వీరభద్రుని సేవలో ఐఏఎస్ సోనాల్ గోయెల్


