సత్యసాయి బాలవికాస్తో బంగారు భవితకు పునాది
ప్రశాంతినిలయం: సత్యసాయి బాలవికాస్ విద్య ద్వారా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు పేర్కొన్నారు. ప్రశాంతినిలయంలో బాలవికాస్ పూర్వ విద్యార్థుల 16వ ఆలిండియా సమావేశం శనివారం ఘనంగా ప్రారంభమైంది. సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మేళనాన్ని ప్రారంభించారు. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన 2,500 మంది బాలవికాస్ పూర్వ విద్యార్థులు, గురువులు పాల్గొన్నారు. ముందుగా ఆర్జే రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తి, నిమీష్పాండ్యాలు బాలవికాస్ విద్యా విధానానికి సంబంధించిన టేబుల్ బుక్ను విడుదల చేశారు. రత్నాకర్ రాజు మాట్లాడుతూ బాల్యం నుంచే క్రమశిక్షణ కలిగిన విద్యను అందిస్తూ ఆరోగ్యకరమైన బాల్యాన్ని తీర్చిదిద్దాలని సత్యసాయి బాబా 1969లో బాలవికాస్ విద్యా విధానాన్ని ప్రారంభించారన్నారు. నేడు దేశంలోని 1,676 బాలవికాస్ కేంద్రాల్లో 21,370 మంది గురువులు బోధన అందిస్తున్నారన్నారు. అనంతరం బాల వికాస్ విద్యార్థులు నృత్యప్రదర్శన నిర్వహించారు. మానవతా విలువలతో తమదైన ప్రతిభ చాటిన పూర్వ విద్యార్థులకు ప్రతిభా అవార్డులు పంపిణీ చేశారు.
సత్యసాయి బాలవికాస్తో బంగారు భవితకు పునాది


