కమనీయం.. శ్రీవారి కల్యాణం
హిందూపురం: పట్టణంలో శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత పేట వెంకటరమణ స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మూలవిరాట్కు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా బంగారు కవచాలతో అలంకరించారు. ఉత్సవమూర్తులకు ప్రాకారోత్సవం చేపట్టారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత వెంకటరమణస్వామిని పల్లకీలో మేళాతాళాల నడుమ తీసుకువచ్చి ముఖమండపంలో కల్యాణ వేదికపై కొలువుదీర్చారు. వేద మంత్రోచ్ఛారణలతో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం మంగళ హారతులిచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు నవీన్నిశ్చల్, ఆలయ కమిటీ అధ్యక్షుడు భగీరథ నవీన్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
నేడు బ్రహ్మ రథోత్సవం..
పేట వెంకటరమణస్వామి బ్రహ్మ రథోత్సవం ఆదివారం మధ్యాహ్నం జరగనుంది. ఇప్పటికే రథాన్ని తోరణాలతో అలంకరించి సిద్ధం చేశారు.
కమనీయం.. శ్రీవారి కల్యాణం


