రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
● 108కు ఫోన్ చేసినా స్పందించని వైనం
రొద్దం: మండల పరిధిలోని ఆర్ మరువపల్లి పాత చెక్ పోస్టు సమీపంలో వెంకటరాపురం–రొద్దం ప్రధాన రహదరిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యేక సాక్షుల వివరాలమేరకు.. శుక్రవారం సాయంత్రం రెడ్డిపల్లికి చెందిన శివకుమార్ రొద్దం వైపు నుంచి ద్విచక్ర వాహనంలో వస్తున్నాడు. గోనిమేకులపల్లికు చెందిన అన్వర్ ద్విచక్ర వాహనంలో అటుగా వస్తున్నాడు. ఆర్ మరువపల్లి సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేయగా 108 వాహనం పెనుకొండ నుంచి రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పడంతో ప్రైవేట్ వాహనంలో పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. కాగా శివకుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించినట్లు తెలిపారు. రొద్దంలో 108 వాహనం ఉన్నా కూడా తిప్పడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయంపై డీఎం అనిల్ను వివరణ కోరగా రొద్దంలో ఉన్న వాహనం తిప్పకపోవడంపై తమకు సమాచారం లేదన్నారు.
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
పుట్టపర్తి టౌన్: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాలని ఎస్పీ సతీష్ కుమార్ ఆర్టీసీ డ్రైవర్లకు సూచించారు. 37వ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం పుట్టపర్తి ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడంతో పాటు సర్వీసులో ఒక్క ప్రమాదం చేయని ఆర్టీసీ డ్రైవర్లను అభినందించారు. కార్యక్రమానికి ఎస్పీ సతీష్కుమార్, ఆర్డీఓ సువర్ణ, డీపీటీఓ మధుసూదన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రమాద రహిత డ్రైవర్లుగా ఎంపికై న 18 మందిని డ్రైవర్లను సన్మానించారు. ప్రశంసాపత్రాలు, మెమొంటోలు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... రహదారులపై చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని, అందువల్ల ప్రతి పౌరుడూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆర్టీసీ డ్రైవర్లపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సురక్షిత ప్రయాణానికి డ్రైవర్లంతా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఇయతుల్లా, ఆరు డిపోల మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్చార్జ్లు, డ్రైవర్లు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు


