
డ్రోన్ వినియోగంపై రైతులకు శిక్షణ
పుట్టపర్తి అర్బన్: పంటల సాగులో డ్రోన్లు వినియోగించేలా రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. మండలానికి ఒకరికి డ్రోన్ వినియోగంపై శిక్షణ ఇచ్చి రైతులకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. పురుగు మందుల పిచికారీ, ఎరువుల చల్లడానికి ఉపయోగకరమైన డ్రోన్లు శుక్రవారం జిల్లాకు చేరుకోగా, కలెక్టర్ అధికారులతో కలిసి వాటి పనితీరును పరిశీలించారు. జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, సెరికల్చర్ అధికారి పద్మమ్మ, టెక్నీషియన్లతో కలిసి పుట్టపర్తి సమీపంలోని పొలాల్లో డ్రోన్ల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో 35 డ్రోన్ గ్రూప్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక్కో గ్రూపులో ఐదుగురు రైతులు సభ్యులుగా ఉంటారన్నారు. అందులో ఒకరు డ్రోన్ కన్వీనర్, మరొకరు కో కన్వీనర్గా ఉంటారన్నారు. ఒక్కో డ్రోన్ ధర రూ.9.8 లక్షలు కాగా, 80 శాతం సబ్సిడీతో అందజేయనున్నట్లు వెల్లడించారు. రైతు రూ.5 లక్షలు చెల్లిస్తే తక్కిన మొత్తాన్ని బ్యాంకులు రుణం అందిస్తాయన్నారు. డ్రోన్ వినియోగించే సమయానికి సబ్సిడీ మొత్తం రైతు గ్రూపు ఖాతాకు జమ చేస్తారన్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని 28 మంది యువతకు పైలెట్ శిక్షణ పూర్తి చేసినట్లు చెప్పారు. తక్కిన 7 మందికి త్వరలో మూడో బ్యాచ్లో శిక్షణకు పంపుతామన్నారు. 35 గ్రూపులకు 35 డ్రోన్లు అందజేసి వాటి ద్వారా రైతులు తక్కువ ధరకే మందులు పిచికారీ చేసుకునేలా చూస్తామన్నారు. ప్రస్తుతం గ్రూపులన్నింటికీ బ్యాంక్ ఖాతాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
జిల్లాలో 35 డ్రోన్ గ్రూపులు: కలెక్టర్ చేతన్