
మార్కులే జీవితం కాదు
హిందూపురం అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. ఎంతో మందికి 600లకు 400లకు పైబడి మార్కులు వచ్చాయి. పలు కారణాలతో కొందరు పరీక్ష తప్పారు. అలాంటి వారు క్షణికావేశంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకోరాదని, మార్కులే జీవితం కాదని మేధావులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఓటమి కూడా భవిష్యత్తు విజయానికి తొలిమెట్టులాంటిదని అంటున్నారు. పరీక్షల్లో ఎందుకు తప్పాం? లోపం ఎక్కడ ఉంది? అనే అంశాలను విశ్లేషించుకుని అడుగు ముందుకేస్తే త్వరలో జరిగే అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల్లో తప్పక ఉత్తీర్ణత సాధిస్తారని అంటున్నారు.
ఫెయిల్ అంటే జీవితంలో ఓడిపోవడమా?
ఫెయిల్ అంటే ఎప్పటికీ ఓడిపోవడం కాదు. విజయాన్ని ఇంకా అందుకోలేదని అర్ధం, గెలుపునకు తగినంత సన్నద్ధత కాలేదని అర్థం. ప్రతి మనిషి తన జీవితంలో చేసే ప్రయత్నాలన్నీ గెలుపు లక్ష్యంగానే మొదలు పెడతాడు. ఆ ప్రయత్నాలలో విజయాలే కాదు ఓటమి కూడా ఎదురవుతుంది. విజయాన్ని సాధించాలంటే కొన్నిసార్లు ఓటమిని తప్పనిసరిగా అంగీకరించాల్సి వస్తుంది. ఓటమి విజయానికి తొలిమెట్టు అనే మాటను మరచిపోకూడదు. చాలామంది వారు చేసే పనులలో ఓటమి ఎదురయినప్పుడు భయపడి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మరో ప్రయత్నం చేస్తూ ఉండాలి. విఫలమైన ప్రతిసారీ చేసిన తప్పేంటో అర్థం చేసుకుని అది పునరావృతం కాకుండా ముందడుగు వేస్తే తిరుగులేని విజయం సొంతమవుతుంది.
తల్లిదండ్రులూ ఆలోచించండి..
ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో పరీక్షలు తప్పి ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆత్మనూన్యత భావంతో మానసిక స్థైర్యం కోల్పోయారు. ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ముందున్న విస్తృత అవకాశాలు తెలిసి ఉండేవి. ఓటమి కూడా భవిష్యత్తులో సాధించబోయే విజయానికి తొలిమెట్టు అనే విషయాన్ని గుర్తించకపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. పాస్, ఫెయిల్ సాధారణ విషయాలే అయినా వ్యక్తిగత ప్రతిష్టకు పోయి పిల్లల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయరాదని తల్లిదండ్రులకూ సూచిస్తున్నారు. విద్యార్థులు సైతం ప్రతికూలంగా ఉన్న ఫలితాలపై ఎలాంటి ఆందోళన చెందకుడా పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు.
హిందూపురం పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని బుధవారం వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో 600లకు 571 మార్కులు సాధించింది. అయితే ఆ విద్యార్థినికి వారి తల్లిదండ్రులకు తృప్తి లేదు. దీంతో ఆ విద్యార్థిని బోరున విలపించింది. ఇక్కడ ఆమె కంటే తక్కువ మార్కులు వచ్చిన వారు ఉన్నారనే భావన సదరు విద్యార్థినితో పాటు తల్లిదండ్రులూ గుర్తించలేకపోయారు. అంతటితో ఆగకుండా ఆమె ఆత్మస్తైర్యం కోల్పోయాల పెదవి విరుపు మాటలతో నిరుత్సాహపరిచారు.
వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాలు
ఓటమి విజయానికి తొలిమెట్టు
క్షణికావేశంతో అనాలోచిత
నిర్ణయాలు వద్దు
హిందూపురంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివిన ఓ విద్యార్థి 600లకు 470 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఈ సంతోషాన్ని పదిమందితో పంచుకునేందుకు స్వీట్లు పంచాడు. మార్కులు తక్కువ వచ్చాయి కదా? అని అడిగితే ఇది ఆరంభం మాత్రమేనని భవిష్యత్తులు మరిన్ని ఎక్కువ మార్కులు సాధిస్తాననే ఆత్మస్థైరాన్ని కనబరిచాడు.
.... ఆశించిన ఫలితం రాలేదని, ఉత్తీర్ణత సాధించలేకపోయామనే భావనలో కొందరు విద్యార్థులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికమైన ఆలోచనతో సరిదిద్దుకోలేని నిర్ణయం తీసుకుంటున్నారు. దీన్ని అధిగమించి, ఆశావహదృక్పథంతో అడుగేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మార్కులే జీవితం కాదనే అంశంపై పిల్లలను చైతన్య పరచాలని అంటున్నారు.
అర్హత తెలిపేందుకే సర్టిఫికెట్
మార్కులు, సర్టిఫికెట్ అనేది కేవలం అర్హతను మాత్రమే తెలుపుతాయి. పెద్దగా చదువుకోలేని వారు... పదో తరగతి పరీక్షల్లో తప్పిన వారు సైతం ప్రస్తుతం వ్యాపారాల్లో రాణించి ఉన్నత స్థానానికి ఎదిగారు. మార్కులు తక్కువ వచ్చాయని, మనం కోరుకున్న కళాశాలలో సీటు రాదని బెంగ అక్కర్లేదు. ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ దాగి ఉంటుంది. దానిని తల్లిదండ్రులు గుర్తించి, పిల్లలను ఆ దిశగా ప్రోత్సహించాలి.
– డాక్టర్ సతీష్రెడ్డి, ప్రభుత్వ వెద్యుడు
పిల్లలను ప్రోత్సహించాలి
పిల్లలు ఫెయిలయితే తల్లిదండ్రులు తిట్టడం సర్వసాధారణం. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పదో తరగతి అంటే పెద్ద వయసేమీ కాదు... మరోసారి మంచిగా చదివి ఉత్తీర్ణత సాధించాలని ప్రోత్సహించాలి. అప్పుడే విద్యార్థులు క్షణికావేశానికి లోనుకాకుండా ఉంటారు. లేకపోతే వారిలో ఆత్మనూన్యత భావం పెరిగి అనాలోచిత నిర్ణయాలు తీసుకునే ప్రమాదముంది. – బాబావలి,
విద్యార్థి సంఘం నాయకుడు, హిందూపురం

మార్కులే జీవితం కాదు

మార్కులే జీవితం కాదు