
దివ్యాంగులకు వరం.. యూడీఐడీ
దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న యూడీఐడీ (యూనిక్ డిసబిలిటీ ఐడెంటిటీ) కార్డు ఓ వరం కానుంది. ఈ కార్డు ద్వారా వారు తమ వైకల్య శాతాన్ని రుజువు చేయవచ్చు. అంతేకాక ఇతర రాష్ట్రాల్లోనూ సులభంగా సదుపాయాలను పొందవచ్చు.
ప్రశాంతి నిలయం: సమాజంలో దివ్యాంగులు తమ సంరక్షణకు పడే పాట్లు అన్నిఇన్నీ కావు. ఈ క్రమంలో వారు తమకు అవసరమైన సేవలను సులువుగా పొందేందుకు వీలుగా యూనిక్ డిసబిలిటీ ఐడెంటిటీ (యూడీఐడీ) కార్డును కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తోంది. రాబోవు రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలంటే ఈ కార్డులు తప్పనిసరిగా కానున్నాయి.
సేవలను సులభతరం చేయడమే లక్ష్యం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు అందించే ప్రయోజనాల కోసం ఇప్పటి వరకూ సదరం సర్టిఫికెట్ తప్పని సరి అయింది. దీని కోసం దివ్యాంగులు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా ముందుగా సదరం స్లాట్ బుక్ చేసుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన వైద్య శిబిరంలో వైద్యులు వైకల్య ధ్రువీకరణ అనంతరం సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు నెలల తరబడి సమయం పడుతోంది. ఇలాంటి తరుణంలో సదరం సర్టిఫికెట్లకు స్వస్తి పలుకుతూ ఆ స్థానంలో యూడీఐడీలను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
యూడీఐడీ కార్డు పొందాలంటే https://www. swavlambancard.gov.in/ వెబ్సైట్ ద్వారా స్వయంగా లేదా మీ సేవా కేంద్రాల నుంచి కూడా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత గతంలో మాదిరిగానే జిల్లా ఆస్పత్రిలో నిర్వహించే క్యాంప్లకు హాజరైతే అక్కడ వారికి స్లాట్ కేటాయించి, మెడికల్ క్యాంప్ ఎప్పుడు ఉండేదనేది ఫోన్ ద్వారా సమాచారం అందజేస్తారు. వారు చెప్పిన రోజున క్యాంప్నకు హాజరైతే సంబంధిత డాక్టర్లు పరీక్షలు నిర్వహించి వైకల్య శాతాన్ని ధ్రువీకరిస్తూ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. దీని ప్రకారం యూడీఐడీ జనరేట్ అయి కార్డు నేరుగా ఇంటికే చేరుతుంది. ఇప్పటి వరకు కేవలం 7 రకాల వైకల్యం ఉన్న వారికే మాత్రమే మీ సేవ ద్వారా సదరం శిబిరాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇకపై 21 రకాల వైకల్యాలకు సంబంధించిన సేవలను పొందేలా సులభతరం చేశారు. ఈ కార్డుల ద్వారా సామాజిక భద్రత పింఛన్లతో పాటు ఇతర సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా ఎక్కడైనా పొందే వెసులుబాటు ఉంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి యూడీఐడీ ప్రాజెక్ట్
ప్రతి సారీ అర్హత పత్రాలతో తిరిగే అవసరం లేదు
వివరాలన్నీ కార్డుపై క్యూఆర్ కోడ్ రూపంలో నిక్షిప్తం
21 రకాల వైకల్యాలకు యూడీఐడీ ద్వారా గుర్తింపు
జిల్లా వ్యాప్తంగా 54,600 మంది
దివ్యాంగులకు లబ్ధి
తప్పని సరిగా యూడీఐడీ కార్డు పొందాలి
జిల్లాలో సుమారు 54,600 మంది దివ్యాంగులు ఉన్నారు. వీరిలో 35,078 మంది దివ్యాంగుల పింఛన్లు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూడీఐడీ కార్డును ప్రతి ఒక్కరూ పొందాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి లబ్ధి పొందాలన్నా ఈ కార్డు తప్పనిసరి. పూర్తి వివరాల కోసం 94400 33130లో సంప్రదించవచ్చు.
– వినోద్, అసిస్టెంట్ డైరెక్టర్,
జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ

దివ్యాంగులకు వరం.. యూడీఐడీ