
వైభవంగా పోతులరాజు మహోత్సవం
గుడిబండ: మండల కేంద్రానికి కూతవేటు దూరంలో వెలసిన తుమ్మల మారెమ్మదేవి ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత తుమ్మల మారెమ్మదేవి మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేసి మహంకాళి రూపంలో అలంకరణ చేశారు. అనంతరం గ్రామ నడిబొడ్డును వెలసిన వీరభద్రస్వామి ఆలయం నుంచి పోతులరాజులు ప్రత్యేకంగా అలంకరించుకుని పురవీధుల గుండా నృత్యం చేస్తూ మారెమ్మదేవి ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం సమీపంలో పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవాన్ని నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు కర్ణాటక ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రమయ్యాయి. భక్తులకు గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
కొడికొండ చెక్పోస్ట్లో చైన్స్నాచింగ్
చిలమత్తూరు: మండలంలోని కొడికొండ చెక్పోస్ట్లో ఓ మహిళ మెడలోని బంగారం గొలుసును దుండగులు అపహరించుకెళ్లారు. ఎస్ఐ మునీర్ అహమ్మద్ తెలిపిన మేరకు... గురువారం ఉదయం చెక్పోస్టులోని ఓ దుకాణం వద్దకు వెళ్లిన ఇద్దరు యువకులు కూల్డ్రింక్ కావాలని అడిగారు. ఆ సమయంలో దుకాణ నిర్వాహకురాలు ఫ్రిడ్జ్ నుంచి కూల్ డ్రింక్ బాటిళ్లు తీస్తుండగా ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పెనుగాలులకు నేలకొరిగిన అరటి
కూడేరు: మండలంలోని మరుట్ల–1వ కాలనీలో గురువారం పెనుగాలుల ధాటికి కౌలు రైతు బెస్త ఎర్రిస్వామి సాగు చేసిన అరటి చెట్లు విరిగిపడ్డాయి. కోత దశలో ఉన్న దాదాపు 1500 అరటి చెట్లు విరిగిపోవడంతో రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు.

వైభవంగా పోతులరాజు మహోత్సవం