ఉదయగిరి: వెనుకబడిన ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ప్రభుత్వం వేగవంతం చేసి.. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్, సీతారామ్సాగర్కు నిధులను తక్షణమే కేటాయించాలని ఏపీ రైతు సంఘ జిల్లా సహాయ కార్యదర్శి కాకు వెంకటయ్య పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్లో అంతర్భాగమైన పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్, సీతారామ్సాగర్ను వెంటనే నిర్మించాలంటూ కరపత్రాలను స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో ఆదివారం ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశ పనులు పూర్తయినా, అనేక జలాశయాలను నింపే కాలువలు, తూర్పు కాలువ పనులు పూర్తి కాకపోవడంతో ఆయా ప్రాంతాలకు సాగు, తాగునీరందే పరిస్థితి లేదని చెప్పారు. తూర్పు కాలువ పూర్తయితేనే పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్కు నీరు చేరుతుందని వివరించారు. అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి పనులను వేగవంతం చేయాలని కోరారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు గానూ ఉదయగిరి గ్రామ పంచాయతీ ఆవరణలో రైతు సదస్సును ఈ నెల 27న నిర్వహించనున్నామని, దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ కార్యదర్శి కోడె రమణయ్య తదితరులు పాల్గొన్నారు.


