● వైఎస్సార్సీపీ గూడూరు
సమన్వయకర్త గురవయ్య
చిల్లకూరు: ‘గూడూరు నియోజకవర్గంలో అధికార పార్టీ చేస్తున్న అరాచకాలపై బహిరంగంగా మాట్లాడితే అక్రమ కేసులు బనాయించేందుకు సిద్ధపడుతున్నారు. అలాంటి ఉడత బెదిరింపులకు భయపడేది లేదు’ అని వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య తెలిపారు. వైఎస్సార్సీపీ అనుబంధ కమిటీల్లో ఎంపికై న వారికి గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చిల్లకూరు మండలం వైఎస్సార్సీపీ కన్వీనర్ యద్దల మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వల్లిపేడులో నిర్వహించారు. ఈ సందర్భంగా గురవయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎన్నికలకు తాము సిద్ధమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకునేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో రెండేళ్లలో జరిగిన దోపిడీపై ప్రశ్నిస్తే గతంలో మీ పార్టీకి చెందిన వారు చేశారని ఎమ్మెల్యే ఆరోపించారన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నది మీరే కదా.. ఏ విచారణ అయినా జరిపించి తప్పు చేసి ఉంటే శిక్షించాలని డిమాండ్ చేశారు. పసలేని ఆరోపణలు చేస్తూ కాలయాపన చేయొద్దని, అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హత ఉన్న వారికి సంక్షేమ ఫలాలు అందజేశారని గుర్తు చేశారు. రెండేళ్ల తర్వాత పింఛన్లు ఇస్తున్నామని ప్రకటించి వారం రోజుల గడువులో సవాలక్ష కొర్రీలు పెట్టి దరఖాస్తులు స్వీకరించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. చిల్లరూరు మండలం ముత్యాలపాడు చెరువులో సొసైటీకి చెందిన దళితులు మత్స్యకార పింఛన్కు దరఖాస్తులు ఇచ్చేందుకు వెళ్తే సచివాలయ సిబ్బంది తీసుకోలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అంతకు ముందుగా చేడిమాల పంచాయతీలోని సీనియర్ నాయకుడు రాజనేని పిచ్చయ్యనాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యులు వేమారెడ్డి కుమారస్వామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మెన్నెం శీనయ్య, వైస్ ఎంపీపీ చెంగయ్య, నాయకులు ఓడూరు బాలకృష్ణారెడ్డి, మధురెడ్డి, రాజేష్, అశోక్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీటీసీ జానకిరాం, మనోజ్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మనుబోలు కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.


