● కలెక్టర్ కార్యాలయంలో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● వినతులు స్వీకరించిన ఉన్నతాధికారులు
● పెన్షన్, ఆర్థిక సాయం కోసం వినతి
నెల్లూరురూరల్: ‘వారంతా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఎన్నో ఆశలతో అధికారులకు వినతిపత్రాలు అందించి పరిష్కరించాలని వేడుకున్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్ వినతులు స్వీకరించారు.
వెలిగొండ జలాల కోసం..
ఉదయగిరి నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు వెలిగొండ జలాలను అందించాలని బీజేపీ నేత మిడతల రమేష్ కోరారు. జిల్లాలోని 8 మండలాల పరిధిలో సుమారు 120 గ్రామాల ప్రజలు తాగు, సాగునీటి అవసరాల కోసం భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. భూగర్భ జలాల్లో భార లోహాలు కలవడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ఈ కారణంగా కిడ్నీ వ్యాధులతో ఇప్పటివరకు సుమారు 1,500 మంది మృతి చెందగా, మరో 155 మంది డయాలసిస్ చికిత్స పొందుతున్నారన్నారు. వెలిగొండ జలాలను పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్కు తరలించి, అక్కడి నుంచి ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగు, సాగునీరు అందించాలని రమేష్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐనకోట రఘురామయ్య, సునీల్రెడ్డి, టి. శ్రీనివాసులు, అల్లూరి నాగేంద్రసింగ్ తదితరులు పాల్గొన్నారు.
గుడి నిర్వహణకు సహకరించాలి
చేజర్ల మండలం వావిలేరు గ్రామం దళితవాడకు చెందిన గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. మాతమ్మ దేవాలయానికి సర్వే నంబర్ 175లో మూడు ఎకరాల భూమి ఉందని, సుమారు 50 ఏళ్లుగా ఈ భూమిని లీజుకు ఇచ్చి వచ్చే ఆదాయంతో ఆలయ నిర్వహణ, పూజారి జీతభత్యాలు చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆ భూమిలో రైల్వే లైన్ నిర్మాణం జరుగుతున్నందున ప్రభుత్వం నుంచి పరిహారం అందనుందని, ఆ మొత్తాన్ని దేవాలయానికే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భూమి హక్కుల విషయంలో వివాదం ఉన్నందున స్థానికులను విచారించి న్యాయం చేయాలని జేసీని విజ్ఞప్తి చేశారు. వెంకటరమణయ్య, పెంచలయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


