బుచ్చిరెడ్డిపాళెం: చికెన్ వ్యర్థాలను అక్రమంగా తరలిస్తూ, తమిళనాడు రాష్ట్రానికి చెందిన మద్యాన్ని రవాణా చేస్తున్న ముగ్గురిపై బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. మినగల్లు గ్రామ సమీపంలో చికెన్ వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో బడా దోస్త్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 14 డ్రమ్ముల్లో చికెన్ వ్యర్థాలు ఉండటంతో పాటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన మెక్లీన్ బ్రాందీ ఐదు మద్యం సీసాలు లభ్యమయ్యాయి. వాహనంలో ఉన్న నలబాయి వంశీ, ఎజ్జగిరి ప్రేమ్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు చికెన్ వ్యర్థాలను మినగల్లు గ్రామంలోని చేపల చెరువు యజమాని నరసింహారెడ్డికి అప్పగించేందుకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చికెన్ వ్యర్థాలు, మద్యం సీసాలతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


