గూడూరు: గూడూరు పట్టణ నడిబొడ్డులో ఉన్న ధర్మరాజుల స్వామి దేవస్థానానికి సంబంధించిన దుకాణాల లీజుదారులపై పాలకమండలి మంగళవారం సీరియస్ అయ్యింది. ఆలయంలో ఈఓ రవికృష్ణ, పాలకమండలి సభ్యులు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయానికి చెందిన దుకాణాల ద్వారా వేలాదిగా ఆదాయం పొందుతున్నా కనీసం దేవుడికి నైవేద్యాలు కూడా సమర్పించాలనే ఆలోచన చేయని కఠినాత్ములుగా లీజుదారులు ఉన్నారని దుయ్యబట్టారు. దేవుడంటే లీజుదారులకు లెక్కలేదా, పాలకమండలి అంటే లెక్క లేదా అని ప్రశ్నించారు. ఇకపై దేవస్థానానికి చెందిన ప్రతి దుకాణంపై ఉన్న నేమ్ బోర్డులో లోగో కచ్చితంగా ఉండాలని, ఆయా దుకాణాలలో పవిత్రమైన ఆహారం మాత్రమే విక్రయించాలని, అలాగే ఒక దుకాణాన్ని లీజుకు తీసుకుని, రెండు భాగాలుగా చేసి అద్దెకు ఇవ్వడం కుదరదన్నారు. అలాగే లీజులు పొందిన వారు మరొకరికి సబ్ లీజులు ఇవ్వడం నిషిద్ధమన్నారు. ఇకపై దుకాణదారులు పాలకమండలికి సహకారం అందించాలని స్పష్టం చేశారు. సమావేశంలో పాలకమండలి చైర్మన్ వాటంబేటి శివకుమార్, సభ్యులు పాల్గొన్నారు.


