● దళితుడిపై ఆ పార్టీ నాయకుల దాడి
● పోలీసులకు ఫిర్యాదు
అనుమసముద్రంపేట: ‘టీడీపీ ఏం చేసింది?, ఇన్నిరోజులు పార్టీలో ఉన్నందుకు బాధపడుతున్నా’ అని చెప్పిన ఓ కార్యకర్తపై తెలుగుదేశం నాయకులు దాడికి పాల్పడిన ఘటన ఏఎస్పేట మండలం జమ్మవరం ఎస్సీ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గంగపట్నం హరీష్ అనే దళిత వ్యక్తి టీడీపీలో కార్యకర్త. ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పైడి శ్రీనివాసులు, సుగమంచి నవీన్లు దళిత కాలనీలో ప్రచారం నిర్వహించారు. హరీష్కు కరపత్రం ఇచ్చే క్రమంలో ఫొటో తీసేందుకు నాయకులు ప్రయత్నించగా అతను ప్రశ్నించాడు. దీంతో నవీన్.. హరీష్ను కులం పేరుతో తిట్టాడు. అంతటితో ఆగకుండా దాడికి పాల్పడ్డాడు. పడిపోయిన హరీష్ను స్థానికులు వైద్యశాలకు తరలించారు. బాధితుడు స్థానిక పోలీస్స్టేషన్లో టీడీపీ నాయకుడిపై ఫిర్యాదు చేశాడు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): ఆస్పత్రిలో చికి త్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు ఏసీ సెంటర్ (పాత అర్చన థియేటర్ ఎదురుగా) సమీపంలోని సులభ్ కాంప్లెక్స్ వద్ద ఈనెల 4వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం జీజీహెచ్లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. వయసు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. వీఆర్వో వాణి ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి సంతపేట పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం సులభ్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో మృతుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీసినా తెలియరాలేదు. వివరాలు తెలిసిన వారు 94407 00097, 94407 00017 ఫోన్ నంబర్లకు తెలియజేయాలని ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్య కోరారు.
నిమ్మ, మామిడి మొక్కలు
నాటుతున్నాం
● డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్
నెల్లూరు(పొగతోట): ఉపాధి హామీ పథకం ద్వారా పొల్లాల్లో నిమ్మ, మామిడి తదితర పండ్ల మొక్కలను రైతుల పొలాల్లో ఉచితంగా నాటుతున్నట్లుగా డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ తెలిపారు. గురువారం డ్వామా కార్యాలయం నుంచి మండలాల సిబ్బందితో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 1,300 ఎకరాలను ప్లాంటేషన్కు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఐదెకరాల్లోపు భూమి కలిగిన రైతులందరూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జాబ్కార్డుదారులకు ఉపాధి కల్పించడం, పనులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టడంలో రాష్ట్రంలో నెల్లూరు జిల్లా తొలి స్థానంలో నిలిచిందన్నారు. పంచాయతీల్లో నిరంతరం పనులను గుర్తించి, శ్రామికులతో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు వారాల వేతనాలు విడుదలయ్యాయని తెలిపారు. మిగిలిన బకాయిలు కూడా ఈ వారంలోగా జమయ్యే అవకాశం ఉందన్నారు.
రైలు కిందపడి..
● గుర్తుతెలియని వ్యక్తి మృతి
గూడూరు: గూడూరు రైల్వేస్టేషన్ పరిధిలో గు రువారం గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి మృతిచెందినట్లుగా రైల్వే పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.. గూడూరు నుంచి చైన్నెకి వెళ్లే మార్గంలో ఎల్సీ గేట్ ఔటర్ సిగ్నల్ 164 కి.మీ వద్ద పట్టాలపై సుమారు 60 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గ్యాంగ్మెన్లు గుర్తించారు. వారిచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు వె ళ్లి పరిశీలించారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమో దు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
కారు ఢీకొని యువకుడికి
తీవ్ర గాయాలు
మర్రిపాడు: ఏర్పేడు – విజయవాడ జాతీయ రహదారిపై చుంచులూరు గ్రామ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొనడంతో కొత్తపల్లి గ్రామానికి చెందిన రంజిత్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. రంజిత్ మోటార్బైక్పై చుంచులూరు నుంచి కొత్తపల్లి వెళ్లేందుకు జాతీయ రహదారిపైకి ఎక్కుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ గా,స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.


