● టీడీపీ అక్రమాలకు పాల్పడితే సహించొద్దు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
మనుబోలు: సర్ ప్రక్రియ విషయంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అప్రమత్తం చేశారు. సోమవారం మనుబోలుకు వచ్చిన కాకాణి మీడియాతో మాట్లాడుతూ సర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని టీడీపీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. టీడీపీ దొంగ ఓట్లు చేర్పించకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్ఏలదే అన్నారు. చంద్రబాబు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అధికారులకు ఆదేశాలిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడైనా బీఎల్ఓలు పారదర్శకంగా వ్యవహరించకుండా పక్షపాతంగా వ్యవహరిస్తే తన దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. బూత్ లెవెల్ అధికారులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే వైఎస్సార్సీపీ నాయకులు ఉపేక్షించొద్దన్నారు. జిల్లాలో ఎక్కడ పొరపాట్లు జరిగినా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళుతామని తెలిపారు. టీడీీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రతిఘటించాలే తప్ప చూస్తూ ఊరుకోవద్దన్నారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, అనర్హులను తొలగించడం బీఎల్ఓల బాధ్యతన్నారు. అధికారులు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. మంత్రి నారాయణ, మున్సిపల్ కమిషనర్ ఇద్దరూ కలిసి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు బట్టబయలైందన్నారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. దీనికి ముందు మనుబోలుకు చెందిన వైఎస్సార్సీపీ నేత కోసూరు కోటేశ్వరగౌడ్ తల్లి, మాజీ ఉప సర్పంచ్ సుశీలమ్మ మరణించడంతో సోమవారం ఆమె పార్ధీవ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట పార్టీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, మన్నెమాల సాయిమోహన్రెడ్డి, కసిరెడ్డి ధనుంజయరెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, చల్లా నవకోటి, చిట్టమూరు అజయ్రెడ్డి, ఆవుల తులసీరామ్, కేవీఆర్గౌడ్, గిరి, మహేంద్రవర్మ, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.


