నెల్లూరు(వీఆర్సీసెంటర్): దేశ మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడిపై రాసిన పుస్తక పరిచయ కార్యక్రమం ఆదివారం నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. సీనియర్ పాత్రికేయుడు మాశర్మ రచించిన వెంకయ్య నాయకుడు పుస్తక పరిచయ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విచ్చేసి మాట్లాడారు. వెంకయ్య గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. రెండు పర్యాయాలు కేంద్రమంత్రిగా, ఉప రాష్ట్రపతిగా దేశానికి ఎంతో సేవ చేశారన్నారు. ఆయనకు ఉన్న అపారమైన అనుభవంతో రాజ్యసభలో పలు కీలక బిల్లులు ఆమోదింపజేశారన్నారు. ఆయన ప్రాంభించిన అమృత్ 2.0 పథకం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. రాష్ట్రానికి 7 లక్షల టిడ్కో ఇళ్లు మంజూరు చేయించారన్నారు. వెంకయ్య లాంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉన్నారు. ఆయన జీవితం భవిష్యత్ తరాలకు రాజకీయ మహాగ్రంథంమని చెప్పారు. ఆయన సలహాలు, అనుభవం దేశానికి ఎంతో అవసరమన్నారు.


