నెల్లూర(అర్బన్): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సర్ కార్యక్రమంలో పాల్గొంటున్న బూత్ లెవల్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. నగరంలోని వెంగళరావునగర్లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఆర్డీఓ అనూషతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, ఓటర్ల వివరాల ధ్రువీకరణ, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలపై ఆరాతీసిన అనంతరం ఆయన మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. ఫోన్ చేసిన ఓటర్లందరికీ సమాచారాన్ని అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా కృషి చేయాలని కోరారు.
సర్ ప్రక్రియ పరిశీలన
అనుమసముద్రంపేట: ఏఎస్పేట మండలంలో సర్ ప్రక్రియను ఆత్మకూరు ఆర్డీఓ భూమిరెడ్డి పావని శుక్రవారం పరిశీలించారు. ‘సచివాలయంలోనే అంతా’ అనే శీర్షికన సాక్షిలో కథనం గురువారం ప్రచురితమైన నేపథ్యంలో ఆమె స్పందించారు. ఏఎస్పేటలో ఆమె పర్యటించడంతో ఇంటింటికీ బీఎల్వోలు వెళ్లి ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టారు. స్వయంగా ఇళ్లకెళ్లి ప్రక్రియను ఆమె పరిశీలించారు. సర్ ప్రక్రియలో మండలం చాలా వెనుకబడి ఉందని, అంగన్వాడీ నిర్వాహకులు సహకారం అందించాలని సూచించారు. అనుకున్న సమయానికే ప్రక్రియను పూర్తి చేయనున్నామని ఆమె వెల్లడించారు. ఇన్చార్జి తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ప్రతిపాదనలు
నెల్లూరు (టౌన్): రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లాలోని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 15లోపు ప్రతిపాదనలను పంపాలని డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. వివరాలకు www.deo.ne llore.50webs.comను సంప్రదించాలని సూచించారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి.. కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. స్వామివారిని 66,304 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 31,811 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


