● జేసీ వెంకటేశ్వర్లు
బుచ్చిరెడ్డిపాళెం: జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించామని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఆయన బుచ్చిరెడ్డిపాళెంలోని మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి ఎస్ఐఆర్పై మున్సిపల్ కమిషనర్ చినబాబుతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బుచ్చి – 3 సచివాలయాన్ని తనిఖీ చేసి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 97 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందన్నారు. ఇప్పటి వరకు 36 శాతం డిజిటలైజేషన్ చేసినట్లు తెలిపారు. కోవూరు నియోజకవర్గంలో 97.69 శాతం ఫారాల పంపిణీ పూర్తికాగా, 38.4 శాతం డిజిటలైజేషన్ చేసినట్లు వివరించారు. బుచ్చిరెడ్డిపాళెంలో 96 శాతం ఫారాల పంపిణీ పూర్తికాగా, 40 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, మండల తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


