ఉదయగిరి: ఉదయగిరిలో, మర్రిపాడు మండలంలోని కృష్ణాపురం గ్రామంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ శాఖ ఇన్స్పెక్టర్ షేక్.మొహిసిన్ తన సిబ్బందితో కలిసి దుకాణాలను పరిశీలించారు. కాటాలపై ముద్రలు లేకపోవడం, కాలం చెల్లిన వస్తువులు విక్రయించడం, వస్తువులపై కస్టమర్ కేర్ నంబర్, తయారు తేదీ, ముగింపు గడువు తేదీ లేకపోవడం గుర్తించి ఏడు కేసులు నమోదుచేసి రూ.30 వేలు ఫైన్ విధించారు. ఆయన వెంట సిబ్బంది సుబ్బారావు, శ్రీనివాసులు, శ్రీకాంత్ ఉన్నారు.
బస్సు, ఆటో ఢీ
● ఒకరికి గాయాలు
కోట: మండలంలోని కోట క్రాస్రోడ్డు సమీపంలోని చల్లకాలువ వంతెన వద్ద ప్రధాన రహదారిపై గురువారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. విద్యానగర్ నుంచి వాకాడు వైపు వెళ్తున్న ట్రక్కు ఆటో, గూడూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆటో రోడ్డుపై బోల్తా పడింది. దాని డ్రైవర్ సైఫుల్లాకు గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్లో కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం గూడూరుకు తీసుకెళ్లారు. ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరుపుతున్నారు.
మహిళ
అనుమానాస్పద మృతి
గూడూరు: పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో గురువారం ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఒకటో పట్టణ పోలీసుల కథనం మేరకు.. సొసైటీ ప్రాంతానికి చెందిన వలయానందపురానికి చెందిన గోపిదేవి పార్వతి (36)కి 14 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవల కాలంలో కుటుంబంలో వివాదాలు నెలకొన్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం స్థానికులు సమాచారంతో ఆమె ఇంటి వద్దకు వెళ్లి చూడగా చనిపోయి ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై శిరీష తెలిపారు.
రాజరాజేశ్వరి ఆలయ హుండీ కానుకల లెక్కింపు
నెల్లూరు(బృందావనం): రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో హుండీ కానుకల లెక్కింపు గురువారం జరిగింది. కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన్రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి 24 నుంచి జూలై 2వ తేదీ వరకు భక్తులకు అమ్మవారికి కానుకల రూపంలో రూ.27,76,900, అలాగే అన్నదానం హుండీ ద్వారా రూ.80,098లు సమర్పించారన్నారు. కార్యక్రమంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జంజనం శ్రీనివాసరావు, జిల్లా దేవదాయ శాఖకు చెందిన నెల్లూరు ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాసబాబు, ధర్మకర్తల మండలి చైర్మన్ ఏలూరు శిరీష, సభ్యులు, ప్రధాన అర్చకులు సూరావఝుల రఘురామమూర్తి, పోలీసులు, ఎస్బీఐ విశ్రాంత, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్పై ప్రత్యేక దృష్టి
● డీపీఓ వసుమతి
నెల్లూరు(పొగతోట): ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా సకాలంలో పూర్తిచేయాలని డీపీఓ వసుమతి మండల అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లూరులోని కార్యాలయం నుంచి వివిధ మండలాల అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. ఇంటింటికీ వెళ్లి ఫారాలు అందజేయాలన్నారు. పూర్తి సమాచారంతో వాటిని సేకరించాలన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని తెలిపారు.


