● ఆహార కమిషన్ తనిఖీల్లో వెలుగులోకి..
● వివిధ ప్రాంతాల్లో సభ్యుడు లక్ష్మీరెడ్డి పర్యటన
● కోడిగుడ్ల నిల్వపై ఆగ్రహం
● టీచర్లు, హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు
కోవూరు: రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు ఈ.లక్ష్మీరెడ్డి గురువారం కోవూరు నియోజకవర్గంలో పర్యటించారు. కోవూరు మండలం పాటూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. 147 కాలం చెల్లిన గుడ్లు నిల్వ ఉండటాన్ని ఆయన గుర్తించారు. లబ్ధిదారులకు ఫోన్ చేయగా, తమకు గుడ్లు అందలేదని చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్ సుమిత్రకు షోకాజ్ నోటీసులివ్వాలని ఐసీడీఎస్ నోడల్ ఆఫీసర్ అనురాధను ఆదేశించారు. పాటూరు జెడ్పీ బాలుర హైస్కూల్లో తనిఖీలు చేశారు. మధ్యాహ్న భోజనాన్ని మరోచోట తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి లిఖితపూర్వక అనుమతి లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, హెచ్ఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. అనంతరం దామరమడుగు హైస్కూల్కు వెళ్లారు. ఇక్కడ కూడా గుడ్లు పెద్ద సంఖ్యలో నిల్వ ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత భారీ స్థాయిలో స్టాక్ ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పలేక సిబ్బంది నీళ్లు నమిలారు. అలాగే, బుచ్చిరెడ్డిపాళెం బాలికల హైస్కూల్లో ఆయన తనిఖీ చేయగా స్టాక్ రిజిస్టర్ ప్రకారం ఉండాల్సిన దానికంటే 760 గుడ్లు తక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ అక్రమాలపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తూ, బాధ్యులైన హెచ్ఎంలకు నోటీసులివ్వాలని ఆదేశించారు.
వివిధ ప్రాంతాల్లో..
నెల్లూరు(పొగతోట): ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి గురువారం జిల్లాలోని చౌకదుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లు నిల్వ ఉన్న ట్లు గుర్తించారు. సంబంధిత సిబ్బందికి షోకాజు నోటీసులివ్వాలని అధికారులను ఆదేశించారు. నగరంలో చౌకదుకాణాలను పరిశీలించి కార్డుదారులకు రేషన్ సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్ఓ లీలారాణి, సివిల్ సప్లైస్ డీఎం అర్జున్రావు, ఏఎస్ఓ లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కండలేరులో
50.580 టీ ఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 50.580 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,100, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


