అన్నదాత.. నాడు ఖుషీఖుషీగా
● ఫల సాయాన్ని అందించడంలోనూ కక్కుర్తే
● కుంటిసాకులతో పలువురి పేర్ల తొలగింపు
● జగనన్న హయాంలో
రైతు సంక్షేమానికి పెద్దపీట
● ప్రస్తుత సర్కార్ తీరుతో అంతా అయోమయం
వ్యవసాయమే దండగా అంటూ నాడు ప్రకటించిన చంద్రబాబు.. తాజాగా అదే పోకడను
అవలంబిస్తూ అన్నదాత పొట్టగొడుతున్నారు.
ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి,
అధికారంలోకి రావడం.. ఆ తర్వాత తన ఫార్ములా రాజకీయాలను అమలు చేయడంలో ఆయనకెవరూ సాటిరారనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఇందులో తాజాగా అన్నదాత సుఖీభవ పథకం చేరింది. కేంద్ర సాయంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ రూ.20 వేలను అందిస్తామని
ఆర్భాటంగా ప్రకటించిన ఆయన ప్రస్తుతం దాన్ని తుంగలో తొక్కారు. పైగా వివిధ కొర్రీలు పెట్టి అర్హుల పేర్లను మాయం చేసి వారిని వంచించారు.
నెల్లూరు(వేదాయపాళెం): అన్నదాతను టీడీపీ ప్రభుత్వం దగా చేస్తోంది. బూటకపు హామీలతో గద్దెనెక్కిన కూటమి సర్కార్, ప్రస్తుతం రైతులకు అందించే సాయంలోనూ తన కక్కుర్తి బుద్ధిని ప్రదర్శిస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నిధులను శుక్రవారం జమ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో రైతుల సంఖ్యకు భారీగా కోత విధించింది.
పంగనామాలు..
కేంద్రంతో సంబంధం లేకుండా రైతులకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తానంటూ గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుత సీఎం చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇది నిజమేనని నమ్మి ఆయనకు ఓట్లేసిన కర్షకులకు తన నిజస్వరూపాన్ని ఆయన చూపారు. జిల్లాలో 84,134 మంది రైతులను అనర్హులుగా ప్రకటించి వారికి శోకాన్ని మిగిల్చారు. విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు, ఫార్మర్ రిజిస్ట్రేషన్ తదితర కుంటిసాకులతో ఇలా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఇలా..
జిల్లాలో 2.8 లక్షల మంది రైతులున్నారు. అయితే వీరిలో 1,95,866 మందే అర్హులంటూ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో 1,63,125 మందికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వర్తిస్తోంది. వీరికి స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేయాల్సిన తరుణంలో అన్నదాత సుఖీభవకు అరకొరగా ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
నిధుల విడుదల నేడు
అన్నదాత సుఖీభవ మూడో విడత.. పీఎం కిసాన్ 22వ విడత పెట్టుబడి సాయం నిధులు శుక్రవారం సాయంత్రం విడుదల కానున్నాయని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా 1,95,866 మందికి రూ.78.35 కోట్లు.. పీఎం కిసాన్ ద్వారా 1,63,125 మందికి రూ.32.63 కోట్లు జమకానున్నాయని వెల్లడించారు. ఉదయగిరికి రూ.25.74 కోట్లు, ఆత్మకూరుకు రూ.19.59 కోట్లు, కావలికి రూ.10.14 కోట్లు, కోవూరుకు రూ.9.3 కోట్లు, సర్వేపల్లికి రూ.15.84 కోట్లు, నెల్లూరుకు రూ.2.97 కోట్లు, వెంకటగిరికి రూ.9.07 కోట్లు, కందుకూరుకు రూ.18.33 కోట్ల మేర నిధులు జమకానున్నాయని పేర్కొన్నారు.
పీఎం కిసాన్ సాయం
అన్నదాత సుఖీభవ
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి.. రైతుల సంక్షేమానికి పెద్దపీటేశారు. ఆ సమయంలో ఒక కుటుంబంలో ఎంత మంది రైతులుంటే అందరికీ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేశారు. ఎలాంటి ఆంక్షల్లేకుండా.. పార్టీలకతీతంగా అందరికీ అందజేశారు. ఆ సమయంలో పది సెంట్లున్న రైతుకూ సాయమందేది. అయితే ప్రస్తుత ప్రభుత్వం తమను విస్మరిస్తోందనే భావన కర్షకుల్లో వ్యక్తమవుతోంది.


