ఇందుకూరుపేట: మండలంలోని పల్లిపాడు డైట్లో 20 రోజుల పాటు నిర్వహించిన టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి కరికులం, టెక్స్ట్ బుక్ డెవలప్మెంట్ విభాగ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ అక్కిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీలో కారుణ్య నియామకాలు
నెల్లూరు(పొగతోట): జెడ్పీ యాజమాన్య పరిధిలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన ఐదుగురు ఉద్యోగుల కుటుంబసభ్యులకు ఉద్యోగావకాశాలను కారుణ్య నియామకాల ద్వారా కల్పించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈఓ శ్రీధర్రెడ్డి, డిప్యూటీ సీఈఓ మోహన్రావు గురువారం అందజేశారు. జూనియర్ అసిస్టెంట్గా ఒకర్ని, ఆఫీస్ సబార్డినేట్లుగా నలుగుర్ని నియమించారు. అదే విధంగా జెడ్పీలో సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న ఇద్దరికి పరిపాలనాధికారులుగా ఉద్యోగోన్నతులు కల్పించారు. అసోసియేషన్ నేతలు లక్కాకుల పెంచలయ్య, బాషా, భీమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 9 నుంచి
పొగాకు కొనుగోళ్లు
ఆత్మకూరు రూరల్: డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లను వచ్చే నెల తొమ్మిది నుంచి ప్రారంభించనున్నామని నిర్వహణాధికారి సునీల్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని జాలయ్యనగరంలో పొగాకు రైతులతో కలిసి క్షేత్ర దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. పొగాకు తోటల్లో పరిశీలన, కొనుగోళ్ల కంపెనీలతో కలిసి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పొగాకు పంటలో నూతన వంగడాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. క్యూరింగ్ చేసిన బేళ్లనే వేలం కేంద్రానికి తీసుకురావాలని కోరారు. బోర్డు నిబంధనల మేరకు ఒక్కో బేలు 150 కిలోలకు మించకుండా చూడాలని సూచించారు. ఐటీసీ మేనేజర్ వెంకటేశ్వరరావు, జీపీఐ కంపెనీ మేనేజర్ గోపిరెడ్డి, పొగాకు బోర్డు ఫీల్డ్ ఆఫీసర్ ఆదర్శ్ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.


