ఇందుకూరుపేట: పేదల గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ఎన్ని కుట్రలు చేసినా జగనన్నను ప్రజల నుంచి వేరు చేయలేరని మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందుకూరుపేటలోని ఆరో మైలు వద్ద గల వైఎస్సార్ విగ్రహానికి గురువారం నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. మహానేత వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక 600 మంది మరణిస్తే, వారి కుటుంబాలను పరామర్శించేందుకు జగనన్న నాడు పూనుకున్నారని చెప్పారు. అయితే దీనికి సోనియాగాంధీ నిరాకరించడంతో ఆమెను ఎదిరించి ఓదార్పు యాత్రను చేపట్టిన అంశాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మకై ్క ఆయన్ను 16 నెలలు జైల్లో అక్రమంగా నిర్బంధించినా బెదరలేదన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం కుంటుపడ్డాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని చెప్పారు. తమ పార్టీ శ్రేణులపై కేసులను అక్రమంగా మోపి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం తథ్యమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతి, రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసులురెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్బాబు, గొల్లపల్లి విజయకుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టేపాటి నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. .


