● పలువురికి తీవ్రగాయాలు
వింజమూరు(ఉదయగిరి): చంద్రపడియ కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. యర్రబల్లిపాళేనికి చెందిన కూలీలు మంగళవారం వ్యవసాయ పనుల నిమిత్తం ఆత్మకూరు రోడ్డు మార్గంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగులతో బస్సు వింజమూరుకు వస్తోంది. చెన్నకేశవ స్వామి దేవాలయం సమీపంలో ఉన్న మూల వద్ద ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది. అందులో ఉన్న శింగవరపు ఆదిలక్ష్మమ్మకు కాలు, చేయి విరిగింది. బయ్యపురెడ్డి శాంతమ్మకు తలపై తీవ్ర గాయాలయ్యాయి. సోమవరపు వజ్రమ్మ, బయ్యపురెడ్డి శారదతోపాటు ఆటో డ్రైవర్ నడిపిగడ్డ మస్తాన్కు గాయాలయ్యాయి. వీరిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు, ఆత్మకూరుకు తరలించారు. ఎస్సై జయరాజ్ వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
పన్నుల వసూళ్లపై టెలి కాన్ఫరెన్స్
నెల్లూరు(పొగతోట): పంచాయతీల్లో ట్యాక్స్, నాన్ ట్యాక్స్ వసూళ్లను వేగవంతం చేయాలని డీపీఓ వసుమతి ఆదేశించారు. నగరంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. వసూళ్లలో రాపూరు, వింజమూరు, పొదలకూరు తదితర మండలాలు వెనుకబడి ఉన్నాయని చెప్పారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వసూళ్లకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాలని సూచించారు.


